తెలంగాణలో గత కొద్దికాలంగా సమ్మె చేస్తున్న గ్రామ రెవిన్యూ సహాయకులు (వీఆర్ఏలు) తమ రిప్రజెంటేషన్ తో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ తో బుధవారం బీఆర్కేఆర్ భవన్ లో సమావేశమయ్యారు. సీసీఎల్ఏ డైరెక్టర్ రజత్ కుమార్ షైనీ సమక్షంలో జరిగిన ఈ చర్చలలో వీఆర్ఏ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, వీఆర్ఏల రిప్రజెంటేషన్ పై ప్రభుత్వం సానుభూతితో ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎత్తివేయగానే వారి రిప్రజేంటేషన్ లను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. వెంటనే విధులకు హాజరుకావాలని కోరారు.
ఈ సమావేశం సందర్బంగా వీఆర్ఏలు పలు డిమాండ్లను సీఎస్ కు విన్నవించారు. పే స్కేల్ వర్తింపు, సర్వీస్ నిబంధనలు, ప్రమోషన్లు, సమ్మె కాలానికి వేతనం ఇప్పించడం, కేసులు ఎత్తివేయడం, సమ్మె కాలాన్నిప్రత్యేక సెలవుదినంగా ప్రకటించడం. సమ్మెకాలంలో మరణించిన వీఆర్ఏల కుటుంబాలకు పరిహారం చెల్లింపు, వారసులకు ఉద్యోగాలు ఇవ్వడం తదితర డిమాండ్లను తెలిపారు. ఈ సమావేశంలో ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి, వీఆర్ఏ జేఏసీ సెక్రెటరీ జనరల్ దాదేమియా, కన్వీనర్ డీ.సాయన్న, కో కన్వీనర్ వంగూరు రాములు, వై.వెంకటేష్ యాదవ్, మహమ్మద్ రఫీ, ఎం.గోవింద్, కె.శిరీష రెడ్డి, వై.సునీత, మాధవ్ నాయుడు, ఎల్.నర్సింహా రావు, సాగర్, సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచే విధుల్లోకి:
సీఎస్ తో సమావేశం అనంతరం వీఆర్ఏ జేఏసీ నేతలు మాట్లాడుతూ, సమస్యలు పరిష్కారంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిందన్నారు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేస్తామని సీఎస్ తెలుపడంతో సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. అక్టోబర్ 13, గురువారం నుంచే విధులకు హాజరు అవుతామని వీఆర్ఏ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. అలాగే తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY