తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్, సీనియర్ నేత స్వామిగౌడ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న స్వామిగౌడ్ 2020 నవంబర్ లో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. కాగా తాజాగా స్వామిగౌడ్ బీజేపీకి రాజీనామా చేస్తూ, తన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు పంపించారు. ఈ క్రమంలో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ తో స్వామిగౌడ్ సమావేశం అయినట్టు తెలుస్తుంది. ఆయన తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశముంది.
“అనేక ఆకాంక్షలతో బీజేపీలో చేరినప్పటికీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలోనూ, గౌరవించడంలో మీరు అనుసరిస్తున్న తీరు నా మనస్సుకు చాలా గాయపరిచింది. పార్టీలో ఉన్న ధనవంతులకు, బడా కాంట్రాక్టర్లకు ప్రాతినిధ్యం పెంచుతూ, నిబద్ధతతో నిజాయితీగా ప్రజా సమస్యల పట్ల నిరంతరం శ్రమిస్తున్న బలహీనవర్గాల కార్యకర్తల పట్ల, నాయకుల పట్ల మీరు అనుసరిస్తున్న తీరు ఆక్షేపణీయం. బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ఎదిగిన మీరు, బలహీన వర్గాల ఉన్నతికి ఎలాంటి ప్రయత్నం చేయకుండా, ఇతరులు చెప్పినట్టు నడుచుకుని నాలాంటి ఎందరో నాయకులు అవమానాలకు గురవుతున్నారు. పార్టీలో అవమానాలు భరిస్తూ కొనసాగలేకపోతున్నాను. కలత చెందిన మనసుతో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. పార్టీలో ఇంతకాలం మీరందించిన సహకారానికి ధన్యవాదాలు” అని బండి సంజయ్ కు రాసిన రాజీనామా లేఖలో స్వామిగౌడ్ పేర్కొన్నారు.
ముందుగా ఉద్యోగ సంఘాల నేతగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో స్వామిగౌడ్ కీలక పాత్ర పోషించారు. అనంతరం టిఆర్ఎస్ పార్టీలో చేరి కరీంనగర్ నుంచి గ్రాడ్యుయేట్స్ విభాగంలో ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. 2014 నుంచి 2019 వరకు తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం కొంతకాలంగా స్వామి గౌడ్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండి, గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో స్వామి గౌడ్ బీజేపీలో చేరారు. తాజాగా పార్టీలో అసంతృప్తితో బీజేపీకి రాజీనామా చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY