2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులకు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు మార్చ్ 5, గురువారం నాడు మరోసారి డెత్ వారెంట్లు జారీ చేసింది. మార్చి 20, 2020వ తేదీ ఉదయం 5:30 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఉరిశిక్షను అడ్డుకునేందుకు దోషులు వివిధ రకాల ప్రయత్నాలు చేయడంతో ఉరిశిక్ష అమలు మూడు సార్లు వాయిదా పడింది. ఈ ఏడాది జనవరి 22న, ఫిబ్రవరి 1న, మార్చ్ 3న ఉరిశిక్ష అమలుకు డెత్ వారెంట్లు జారీ అయినప్పటికీ, నలుగురు దోషులు న్యాయపరమైన అవకాశాల పేరిట వరుస పిటిషన్లు దాఖలు చేయడంతో ఉరి వాయిదా పడుతూ వస్తుంది.
ఈ నేపథ్యంలో ఉరిశిక్ష అమలు అవుతుందా, వేరే ఇతర పిటిషన్లతో దోషులు మరోసారి అడ్డుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే నలుగురు దోషుల క్షమాబిక్ష పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించడం, రివ్యూ పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేయడంతో వారికున్న అన్ని అవకాశాలు పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మార్చి 20వ తేదీన ఉరిశిక్ష అమలు కావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.