కామారెడ్డి మాస్టర్ ప్లాన్పై మొదలైన ఆందోళనలు శనివారం మూడోరోజు కూడా కొనసాగుతున్నాయి. దీనిపై గత రెండు రోజులుగా కామారెడ్డిలో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తలకు దారి తీయగా.. శుక్రవారం రైతు సంఘాల నేతృత్వంలో జిల్లాలో బంద్ కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ మరియు బీజేపీలు కూడా రైతుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ క్రమంలోనే కామారెడ్డి రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మాస్టర్ ప్లాన్పై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. మున్సిపల్ అధికారులు దీనిపై తమకు ఎలాంటి ముందస్తు సమాచారం అందించలేదని, ఈ ప్లాన్ తమకు తీవ్ర నష్టం చేకూర్చేదిగా ఉందని, దీనిని నిలిపివేయాలని హైకోర్టుకు విన్నవించారు. ఇక దీనిని స్వీకరించిన హైకోర్టు సోమవారం విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా కామారెడ్డి మున్సిపాలిటీ బృహత్ ప్రణాళికను ఢిల్లీకి చెందిన ఒక ప్రైవేట్ సంస్థతో తయారు చేయించారు. ఇది రూపొందించిన ముసాయిదా ప్రకారం పట్టణాన్ని ఇండస్ట్రియల్, గ్రీన్, కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్లుగా విభజించారు. దీనిలో కామారెడ్డి పట్టణంతో అడ్లూర్, టెకిర్యాల్ , కాల్సిపూర్, దేవునిపల్లి, లింగాపూర్, సరంపల్లి, పాతరాజంపేట, రామేశ్వరపల్లి వంటి పరిసర గ్రామాలను కలుపుకుని 61.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మాస్టర్ ప్లాన్ ముసాయిదా రూపొందించారు. అయితే దీనికోసం ఈ గ్రామాల్లోని రైతుల నుండి భూములను సేకరించాల్సి ఉంది. దీంతో తమ భూములను వదులుకునేది లేదంటూ రైతులు అభ్యంతరం తెలుపుతున్నారు. ఇక ఇదిలా ఉండగా దీనిపై మంత్రి కేటీఆర్ కూడా ఇటీవలే స్పందిస్తూ.. రైతులకు ప్రభుత్వం తప్పక న్యాయం చేస్తుందని, వారికి అభ్యంతరం ఉంటే అధికారుల దృష్టికి తేవాలని, కావాలంటే ఈ మాస్టర్ ప్లాన్ మారుస్తామని హామీ ఇచ్చారు. అయినాసరే రైతులు తమ ఆందోళనలను కొనసాగిస్తుండటం గమనార్హం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE