తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో మినీ జాతర (మండమెలిగే పండుగ) బుధవారం ఘనంగా ప్రారంభమైంది. మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కాగా ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహాజాతర అనంతరం తదుపరి సంవత్సరం మేడారంలో సమ్మక్క పూజారులు, కన్నెపల్లిలో సారక్క పూజారులు అక్కడి పూజా మందిరాల్లో మండ మెలిగే పండగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా మేడారంలోని సమ్మక్క ఆలయాన్ని సిద్దబోయిన వంశానికి చెందిన పూజారులు పుణ్యస్నానాలు ఆచరించి క్రతువు నిర్వహించనుండగా.. కన్నెబోయినపల్లి గ్రామంలోని సారలమ్మ ఆలయంలో కాకా కృష్ణయ్య వంశానికి చెందిన పూజారులు పూజలు చేయనున్నారు. దీనికిముందుగా ఆలయాలను శుద్ధి చేసిన అనంతరం అర్చకులు మామిడి ఆకులతో అలంకరించి దేవతలకు దేశ కోళ్లను సమర్పిస్తారు. ఈరోజు రాత్రి తల్లుల పూజారులు ఇరువురూ రాత్రంతా గద్దెల వద్ద జాగారం చేసి ఒకరికి ఒకరు సాకను ఇచ్చిపుచ్చుకుంటారు.
ఈ నేపథ్యంలో వనదేవతలను దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో మేడారం తరలి వస్తున్నారు. ఈ క్రమంలో బుధ, గురు, శుక్రవారాల్లో భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఇక చివరిరోజు పూజా సామగ్రిని శుద్ధి చేసి గుడిలో భద్రపర్చడంతో మినీ జాతర ముగుస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు స్నానాలు చేసేందుకు జంపన్నవాగుపై ఉన్న జంట వంతెనల వద్ద రూ.11.70 లక్షలతో స్నానఘట్టాలపై దాదాపు 350 షవర్లను ఏర్పాటు చేశారు. కాగా ఒకప్పుడు మినీ జాతరకు కేవలం మేడారం చుట్టుపక్కల గిరిజనులు మాత్రమే వచ్చేవారు. కానీ కాలక్రమేణా మినీ జాతరకు కూడా భక్తులు భారీగా వస్తున్నారు. దీంతో ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాట్లు హసిస్తోంది. ఈసారి మినీ జాతరకు దాదాపు 10 లక్షల మంది వరకూ వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం మేడారం సందర్శించి అమ్మవారిని దర్శించుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE