కేంద్ర బడ్జెట్-2023లో ఆరోగ్య సంరక్షణ రంగానికి చేసిన భారీ కేటాయింపులు దేశంలో సుస్థిరమైన ఆరోగ్య సంరక్షణ (హెల్త్ కేర్) రంగాన్ని రూపొందించడంలో సహాయపడతాయని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవలి బడ్జెట్లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు 89,155 కోట్ల రూపాయల భారీ కేటాయింపులు చేయడం వల్ల దేశంలోని ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు మరియు సేవలు అద్భుతంగా మారుతాయని ఆమె అన్నారు. గురువారం రాజ్భవన్లో “కేంద్ర బడ్జెట్ 2023-24లో ప్రతిపాదించబడిన ఆరోగ్య రంగ కార్యక్రమాలు మరియు కేటాయింపులు” అనే అంశంపై చర్చకు గవర్నర్ తమిళిసై అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, బడ్జెట్ లో భారీ కేటాయింపుల వలన దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సాధ్యమైనంత ఉత్తమమైన ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. వైద్య విద్య, పారామెడికల్ రంగం, ప్రజలకు ఆరోగ్య బీమా కవరేజ్ మరియు టెలిమెడిసిన్ ఆరోగ్య సంరక్షణ రంగానికి ఈ భవిష్యత్ బడ్జెట్ కేటాయింపుల ద్వారా పెద్ద ప్రోత్సాహాకం అందనుందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కోసం పెరిగిన వ్యయాన్ని ప్రస్తావిస్తూ, ఈ పథకం కింద మరో 40 కోట్ల మందిని ఆరోగ్య బీమా పరిధిలోకి తీసుకురావాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని వేగవంతం చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్య పరిశోధనలకు కేటాయింపులు పెరగడం మరియు సహకార పరిశోధనల కోసం ఐసీఎంఆర్ ల్యాబ్లను తెరవడం వల్ల ఈ రంగంలో ఆవిష్కరణలు పెరుగుతాయని మరియు నాణ్యమైన పరిశోధనలకు దోహదపడుతుందని గవర్నర్ అన్నారు. గవర్నర్ అధ్యక్షతన చర్చలో సీసీఎంబీ, ఎయిమ్స్, బీబీనగర్, ఎన్ఐఎన్, ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీకి చెందిన ఉన్నతాధికారులు, ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE