ఈ నెల 17న తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం భవనం ప్రారంభోత్సవం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు జాతీయ స్థాయి నేతలు హాజరవనున్నారు. దీంతో ఈ సభను విజయవంతం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటినుంచే సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గురువారం మధ్యాహ్నం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ హాల్లో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, సీనియర్ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి సహా ఇతర ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. చరిత్రలో నిలిచిపోయేలా ఈ సభను విజయవంతం చేయాలని, అందుకోసం భారీగా జన సమీకరణ చేపట్టాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు కీలక సలహాలు, సూచనలు చేశారు. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 10 వేల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని, దీనిపై కిందిస్థాయి కార్యకర్తలకు సమాచారం అందించడానికి ఈ నెల 13న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విస్తృతసాయి సమావేశం నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఇక ప్రతి నియ్యోజకవర్గానికి సీనియర్ ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలను ప్రత్యేకంగా నియమించనున్నామని, ఆ మేరకు వారు తమకు కేటాయించిన నియోజకవర్గాల ప్రకారం ఈనెల 13-17 వరకు స్థానికంగా బసచేసి జనసమీకరణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని మంత్రి కేటీఆర్ నేతలకు వివరించారు.
కాగా పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న ఈ సభకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, జేడీ(యూ) జాతీయ అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తరపు ప్రతినిధిగా లలన్ సింగ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ సహా మరికొందరు జాతీయస్థాయి ప్రముఖులు హాజరుకానున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. అలాగే బహిరంగ సభకు ముందు, అదే రోజు మధ్యాహ్నం హైదరాబాద్లోని కొత్త సచివాలయ సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా వారు పాల్గొననున్నారు. వేద పండితులు సూచించిన శుభ ముహూర్తం ప్రకారం.. ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య భారత రాజ్యాంగ రూపకర్త డా. బీఆర్ అంబేడ్కర్ పేరుతో నిర్మించిన తెలంగాణ నూతన సచివాలయ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆరోజు ఉదయం వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం తదితర పూజా కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE