తెలంగాణ రాష్ట్రంలో 80,039 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీ వర్గాల అభ్యర్థులకు నాణ్యమైన కోచింగ్ అందించడానికి బీసీ మంత్రిత్వ శాఖ అన్ని సన్నాహాలు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ బుధవారం నాడు కీలక ప్రకటన చేశారు. దాదాపు రూ.50 కోట్ల ఖర్చుతో బీసీ స్టడీ సర్కిళ్లు, సెంటర్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 1,25,000 మందికిపైగా ఉచిత కోచింగ్ అందిస్తామని ప్రకటించారు. మాసాబ్ టాంక్ లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, అన్ అకాడమీ ప్రతినిధులతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ విలేఖరుల సమావేశం నిర్వహించారు.
బీసీ స్టడీ సర్కిళ్ల కోచింగ్ కోసం ఆన్లైన్ నమోదు ప్రక్రియ నేటి నుంచే ప్రారంభం:
బీసీ సంక్షేమ శాఖ అందించే ఉద్యోగార్థుల శిక్షణ కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నేటి నుంచే ప్రారంభిస్తామని చెప్పారు. అన్ అకాడమీ ద్వారా నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ కు నేటి నుండి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఈ నెల 16న ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో పరీక్ష ఉంటుందని, 10 గంటల వరకు కూడా పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. అభ్యర్థులు
https://studycircle.cgg.gov.in, https://mjpabcwreis.cgg.gov.in వెబ్ సైట్స్ లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. డెస్క్ టాప్, లాప్ టాప్ లతోపాటు మొబైల్ ఫోన్ల ద్వారా పరీక్ష రాసే సౌకర్యం కల్పిస్తామని, 90 నిమిషాల పాటు నిర్వహించే ఈ పరీక్షలో సామర్థ్యం ప్రకారం ఐదు విభాగాలుంటాయని, మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తామని అన్నారు. నెగటివ్ మార్కులు ఉండే ఈ పరీక్షలో కాపీ కొట్టడం, చూచి రాయడానికి వీలులేకుండా టైం వుంటుందని, పరీక్షలో అభ్యర్థులకు ఆయా విభాగాల్లో వచ్చిన మార్కుల ప్రకారం ఏ కోర్సులకు ఎన్నికవుతారు అనేది నిర్ణయించి తెలియజేస్తామని పేర్కొన్నారు.
గ్రూప్-1, గ్రూప్-2 అభ్యర్థులకు స్టైపండ్:
గ్రూప్-1 పరీక్ష కోసం ప్రిలిమ్స్, మెయిన్స్ కలిపి ఆరు నెలల పాటు ఉచిత శిక్షణ ఉంటుంది, దాదాపు పది వేల మంది అభ్యర్థులకు అందించే ఈ శిక్షణలో నెలకు 5 వేల చొప్పున ఆరు నెలలపాటు స్టైపెండ్ సైతం అందిస్తామని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. గ్రూప్-2, ఎస్ఐ ఉద్యోగాల కోసం శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు మూడు నెలల పాటు కోచింగ్ ఉంటుందని, ప్రతి ఒక్కరికీ నెలకు రెండు వేల చొప్పున మూడు నెలలపాటు అందిస్తామన్నారు. ఏప్రిల్ 16న నిర్వహించే ఆన్లైన్ పరీక్ష ఫలితాల్ని సైతం అదే రోజు మధ్యాహ్నం నుండి తెలియజేస్తామని, ఆ తర్వాత ఏప్రిల్ 20 లేదా 21 నుండి కోచింగ్ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. వేల రూపాయలు ఖర్చు చేసే ఈ శిక్షణ బీసీ వెనుకబడిన వర్గాల కోసం ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని, దీన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలని బీసీ యువతను కోరుతున్నానని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ మెకానిజం కోసం అయ్యే టెక్నాలజీ మొత్తం సీఎస్ఆర్ ఫండ్ కింద అన్ అకాడమీ సొంతంగా భరిస్తుందని, వారి ఆధ్వర్యంలోనే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.
16 బీసీ స్టడీ సర్కిళ్లు, 103 నియోజకవర్గాల్లో బీసీ స్టడీ సెంటర్ల ద్వారా ఉచిత కోచింగ్:
టీఎస్ పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1,2,3,4 తో పాటు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నియామకం చేసే పోలీస్ కానిస్టేబుల్, వివిద రకాల ఎస్సై ఉద్యోగాలు, వ్యవసాయ శాఖ, వైద్యశాఖ ఇతర శాఖలు నిర్వహించే పోస్టుల వారీగా కోచింగ్ సదుపాయాన్ని అందజేస్తామని మంత్రి పేర్కొన్నారు. బీసీ సంక్షేమ శాఖ రాష్ట్రంలో నిర్వహిస్తున్న 11 స్టడీసర్కిళ్లతో పాటు మంజూరైన మరో ఐదు స్టడీ సర్కిళ్లు సిరిసిల్ల, సూర్యాపేట, వనపర్తి, నర్సంపేట్, జగిత్యాలలో ఏర్పాటు చేసి వాటి ద్వారా కోచింగ్ అందజేస్తామన్నారు. అదే విదంగా స్టడీ సర్కిళ్లు లేని ప్రతీ నియోజకవర్గంలో స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఒక రీడింగ్ రూమ్, ఆన్లైన్ క్లాస్ రూం, డౌట్ క్లియరెన్స్ రూం ఇలా మూడు రూములతో కూడిన 103 స్టడీ సెంటర్లను త్వరలో ఏర్పాటు చేస్తామని, ఉచితంగా మౌలిక వసతుల కల్పన, ఇతర ఏర్పాట్లు ఎవరైనా ప్రజాప్రతినిధులు, ఎన్జీవోలు ఏర్పాటు చేస్తే అక్కడ సైతం బీసీ స్టడీ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, వీటి ద్వారా కోచింగ్ తో పాటు నాణ్యమైన స్టడీ మెటీరియల్ని అభ్యర్థులకు అందజేస్తామని మంత్రి పేర్కొన్నారు.
16 బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా 25,000 మందికి నేరుగా, మరో 50,000 వేల మందికి హైబ్రిడ్ మోడల్లో ఆన్లైన్, ఆప్ లైన్ మోడ్లో శిక్షణ ఇస్తామని, అలాగే 103 బీసీ స్టడీ సెంటర్ల ద్వారా ఒక్కో దాంట్లో 500 మందికి తగ్గకుండా మరో 50, 000 మందికి మొత్తంగా 1,25,000 మందికి నాణ్యమైన శిక్షణ అందిస్తామన్నారు. ఇందుకోసం ప్రతిష్టాత్మక అన్ అకాడమీతో సహకార ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ అందించే కోచింగ్ లో బీసీలకు 75 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం, ఈబీసీలకు 5 శాతం, మరో ఐదు శాతం మైనారిటీలకు కేటాయిస్తామన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ