ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం త్రిపురలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఆయన బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా రెండు ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. ఈ క్రమంలో ధలాయ్ జిల్లాలోని అంబాస్సాలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో జరిగిన తొలి ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని మోదీ, అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు గోమతి వద్ద రెండవ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలపై ఘాటు విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీల వల్ల రాష్ట్రంలో హింస ప్రబలిందని, బీజేపీ సర్కార్ ఏర్పడ్డాకే పరిస్థితులు అదుపులోకి వచ్చాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ అంబాసాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ‘5 ఏళ్ల క్రితం ఇక్కడ సీపీఐ(ఎం) ప్రభుత్వం ఉన్నప్పుడు ‘సీపీఎం కి చందా వాలీ కంపెనీ’ మీ రేషన్ను దోచుకునేది. పేదలకు రేషన్ ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత, కానీ వామపక్ష ప్రభుత్వాలు మాత్రం పేద ప్రజల రేషన్ను దోచుకునేవారు. కాంగ్రెస్ వారికి వత్తాసు పలుకుతుండేది. అయితే ఆ తర్వాత మీకు బీజేపీ రూపంలో మంచి ప్రత్యామ్నాయం లభించింది. ఈ దీంతో మీరు సీపీఐ(ఎం) ప్రభుత్వాన్ని త్రిపుర నుండి తొలగించి డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిచ్చారు. త్రిపురలో ప్రజల ఆదాయాన్ని పెంచడంపై బీజేపీ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. పీఎం-కిసాన్ కింద రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు బదిలీ చేయబడింది. బీజేపీ మళ్లీ అధికారంలోకి రాగానే ఈ మొత్తాన్ని పెంచుతుంది. మా పాలనలో, రైతులు ఎంఎస్పి ప్రయోజనాలను పొందుతున్నారు’ అని పేర్కొన్నారు.
అనంతరం గోమతిలోని రాధాకిషోర్పూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. ‘త్రిపురను ఏళ్ల తరబడి పాలించిన వారు ఏం చేశారో గుర్తు చేసుకోండి. స్థానిక ఎస్టీలు, పేదలు, మహిళలు, యువత జీవనం కష్టంగా మారింది. వారి కలలు చెదిరిపోయాయి, పిల్లలు రాష్ట్రం విడిచి బయటికి వెళ్లవలసి వచ్చింది’ అని మండిపడ్డారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజలకు నీరు, కరెంటు కూడా దొరకడం కష్టమైంది. వారికి కనీస సౌకర్యాలు కూడా అందలేదు. ఇంతకుముందు ఢిల్లీ, త్రిపురలను పాలించిన వారు ఈ సౌకర్యాల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. ఏళ్ల తరబడి త్రిపురను దోచుకుని, పేదరికంలో బతకాలని ప్రజలను ఒత్తిడి చేసిన వారు ఇప్పుడు ఏకమయ్యారు’ అని అన్నారు. కాగా ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ మరియు నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెలలో త్రిపురలో ఎన్నికలు జరగనున్నాయి, ఫిబ్రవరి 16న, మేఘాలయ మరియు నాగాలాండ్ ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 13న ప్రధాని మళ్లీ త్రిపురలో పర్యటించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE