ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి వస్తే ఇండస్ట్రీ క్లస్టర్లలో పరిశ్రమల ఏర్పాటుకు ముస్లింలకు ప్రత్యేక కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర 23వ రోజు మంగళవారం శ్రీకాళహస్తి పట్టణంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఏర్పాటు చేసిన క్యాంప్ సైట్ వద్ద ముస్లిం, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలతో లోకేశ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ హయాంలోనే ముస్లిం మైనార్టీల సంక్షేమం జరిగిందని, చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసిందని, నాడు టీడీపీ హయాంలో పేదల కోసం టిడ్కో ఇళ్లు నిర్మిస్తే, వాటిని ఇప్పటివరకూ లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు.
ఇక టీడీపీ అధికారంలోకి వస్తే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని, దాని విధి, విధానాలకు సంబంధించి అధ్యయనం జరుగుతోందని నారా లోకేష్ తెలిపారు. అలాగే ముస్లిం మైనార్టీలు ఆర్థికంగా ఎదగడానికి సహకరిస్తామని, వారికి పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. దీనికోసం ఇండస్ట్రీ క్లస్టర్లలో ముస్లింలకు ప్రత్యేక కేటాయింపులు జరుపుతామని హామీ ఇచ్చారు. ఇక టీడీపీ హాయాంలో శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు తీసుకొచ్చామని, ఇప్పుడు ఆ పరిశ్రమల్లో పది వేల మంది వరకు పని చేస్తున్నారని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని, ఇంకా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రంజాన్ తోఫాను నిలిపివేసిందని, అలాగే దాదాపు ఆరు లక్షల ఫించన్లు తొలగించిందని లోకేష్ విమర్శించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE