త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మహర్దశ పట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా మహిళల సంఘాల ఉత్పాదక వస్తువులకు కామన్ బ్రాండింగ్ ఏర్పాటు కానుంది. తెలంగాణ ముద్ర ఉండేట్లుగా బ్రాండ్ పేరు ఉండనుంది. మహిళల వస్తువులకు సార్వత్రిక గుర్తింపునకు సెర్ప్ (పేదరిక నిర్మూలనా సంస్థ) ప్రయత్నాలు చేస్తోంది. ఆకర్షణీయమైన ప్యాకింగ్, లేబిలింగ్ కోసం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఫ్లిప్ కార్డ్ సంస్థతో ఒప్పందం కాగా, అమెజాన్ వంటి ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థలతో మరిన్ని ఒప్పందాలు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిర్ణయించారు. పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి సెక్రటరీ, సెర్ప్ సీఈవో సందీప్ కుమార్ సుల్తానియా, సెర్ప్ అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయం మంత్రుల నివాసంలో ఈ మేరకు సమీక్షించారు. త్వరలోనే మహిళా ఉత్పత్తులకు మార్కెటింగ్ కోసం పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకోవాలని మంత్రి చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక మహిళా సంఘాలు స్వయంగా అనేక వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా కూడా వారు తయారు చేస్తున్న నిత్యావసర సరుకులు, ఇతర వస్తువుల మార్కెటింగ్ పలు విధాలుగా జరుగుతుంది. ఫ్లిప్ కార్డ్ వంటి సంస్థలతో కూడా ఒప్పందాలు కుదిరాయి. అయితే తెలంగాణ మహిళల సంఘాలు తయారు చేస్తున్న వస్తువులకు మంచి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ కు తగ్గట్లుగా, మరింత ఆకర్షణీయంగా లే బిలింగ్, ప్యాకింగ్ చేస్తూ, బ్రాండింగ్ ఏర్పాటు చేస్తే, మన వస్తువులకు మరింత డిమాండ్ పెరిగి, కొనుగోలు బాగా సాగి, లాభదాయకంగా ఉంటుంది. దీంతో అమెజాన్ వంటి బడా అంతర్జాతీయ ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని, మరింతగా వ్యాపారం చేయవచ్చు. ఈ దిశగా ఆలోచిస్తూ తెలంగాణ డ్వాక్రా సంఘాల మహిళల ఉత్పత్తులను మంచి బ్రాండింగ్ చేయాలని వివరించారు.
ఇప్పటికే సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పేరు మారుమోగుతోంది. అభివృద్ధి, సంక్షేమంలో మనకు సాటి లేదు. వివిధ పథకాల రూపకల్పన, అమలులో కూడా తిరుగులేదు. మన మహిళా సంఘాల అభివృద్ధి, పొడుపులోను మనమే దేశంలో నెంబర్ వన్ గా ఉన్నాం. ఈ దశలో మన తెలంగాణ పేరు ప్రతిష్ఠలు ఉట్టి పడేలా, మహిళా ఉత్పత్తులను సులువుగా, ఆకర్షణీయంగా అంతర్జాతీయ మార్కెట్ లో అమ్ముడు పోయేలా ఈజీగా, క్యాచీగా ఉండేట్లుగా బ్రాండింగ్ ఉండాలని మంత్రి సూచించారు. త్వరలోనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతితో కొత్త బ్రాండింగ్ చేయాలని, అందుకు తగ్గట్లుగా పలు పేర్లను పరిశీలించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ హనుమంతరావు, సెర్ప్ అధికారులు రజిత, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE