అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా తెలుగువారందరికీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. మాతృ భాషతోనే మనో వికాసం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “మనోవికాసానికి మూల ధనం మాతృ భాష. అదే అమ్మ భాష. బిడ్డకు ఉగ్గు పాలతోనే లోక జ్ఞానాన్ని కలిగించేది మాతృ భాషేనని గుర్తించిన ఐక్యరాజ్య సమితి ఉపాంగమైన యునెస్కో ఫిబ్రవరి 21న ఏటా మాతృ భాషా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం ఎంతో ముదావహం. ఈ సుదినాన్ని పురస్కరించుకుని తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
“మాతృ భాష పదిలంగా ఉన్నప్పుడే మన సంస్కృతీ సంప్రదాయాలు పదిలంగా ఉంటాయి. అప్పుడే జాతి సజీవంగా, సగర్వంగా అలరారుతుంది. అయితే మిడిమిడి జ్ఞానం కలిగినవారు పాలకులైతే మాతృ భాష మృతభాషగా మారిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. అటువంటి క్లిష్ట సమయమలో ప్రజలే భాషోద్ధారకులుగా మారవలసిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా నియమితులైన ఎస్.అబ్దుల్ నజీర్ కు యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ రాసిన లేఖలో ఉన్నత విద్యలో మాతృ భాషను ప్రోత్సహించాలని, పాఠ్య పుస్తకాలు మాతృ భాషలో అందించేలా చూడాలని కోరారు. యూజీసీ చైర్మన్ జగదీష్ పేర్కొన్న అంశాలను ప్రతి ఒక్కరూ పరిగణనలోకి తీసుకోవాలి. జయితే మాతృ భాష..జయ జయహే తెలుగు భాష” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE