ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) రోజు రోజుకి విజృంభిస్తూ, తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. అగ్రరాజ్యం అమెరికాలో కూడా కరోనా బాధితుల సంఖ్య 18,860 కు చేరుకుంది. కాగా అమెరికాలో ఇప్పటివరకు ఈ వైరస్ వలన 230 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు అధికారిక కార్యాలయమైన వైట్ హౌస్ లో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ బృందంలో ఓ వ్యక్తికి కరోనా సోకినట్టు అధికారికంగా ప్రకటించారు. కరోనా సోకిన వ్యక్తి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో కానీ, మైక్ పెన్స్ తో గాని నేరుగా ఎప్పుడూ సంప్రదింపులు జరుప లేదని, వారికి ఎలాంటి ఇబ్బంది లేదని పెన్స్ కార్యాలయ అధికార ప్రతినిధి వెల్లడించారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందటం మొదలయ్యాక డోనాల్డ్ ట్రంప్ ను కలుసుకున్న పలువురు ప్రముఖులు ఈ వైరస్ బారిన పడ్డారు. దీంతో కొన్ని రోజుల క్రితం ట్రంప్ కూడా కరోనా పరీక్షలు చేయించుకోగా నివేదిక నెగిటివ్ గా వచ్చింది. ఈ పరిస్థితుల అనంతరం వైట్ హౌస్ లో ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమెరికాలో ముఖ్యంగా కాలిఫోర్నియా, న్యూయార్క్, వాషింగ్టన్ రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. గత రెండు రోజుల్లోనే ఆ దేశంలో పది వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి కట్టడి కోసం అమెరికా మొత్తం కలిసి పోరాడుతుందని, ప్రభుత్వం తరఫున అన్ని అధికారాలు ఉపయోగిస్తామని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు.