టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని చూస్తుంటే రాహుల్ గాంధీలా కనిపిస్తున్నారని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ సింగ్ బఘేల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం రాత్రి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డా. అంబేడ్కర్ స్టేడియంలో టీ-కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం భూపేష్ సింగ్ బాఘేల్ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ మోడల్ అంటే పేదల అభివృద్ధి అని, రైతులకు మద్దతు ధర కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపడం అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, కేంద్ర ప్రభుత్వాలు ప్రజలను దోపిడీ చేస్తున్నాయని, పైకి కలహించుకుంటున్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం ఉందని అన్నారు. దేశంలోని రైతులు, మహిళలు, వ్యాపారులు, ఉద్యోగస్తులు.. ఇలా అన్ని వర్గాల ప్రజల డబ్బులను బ్యాంకుల్లో జమ చేసి వాటిని అదానీ, అంబానీ వంటి బడా వ్యాపారులకు బీజేపీ దోచి పెడుతోందని, అదేమాదిరిగా తెలంగాణలో కూడా ప్రజలకు కాకుండా ఒకే కుటుంబానికి ఉపాధి దొరికిందని విమర్శించారు.
ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అయితే సీఎం కేసీఆర్ పైన కోపంతో బీజేపీ వైపు చూడొద్దని, పొరపాటున అలా చేస్తే.. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు అవుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఖాళీగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపడుతామని, పేద రైతులకు రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని, అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా ఐదు లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని, వంట గ్యాస్ సిలిండర్ రూ. 500కే అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మంచి పనులు చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. నాడు ఉద్యమంలో 1200 మంది బలిదానాలు చేసుకుంటే చలించిపోయిన అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటు చేశారని, కానీ సీఎం కేసీఆర్ పాలనలో నేడు అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని మండిపడ్డారు. ఎవరి చేతుల్లో రాష్ట్రం సురక్షితంగా ఉంటుందో వాళ్లకు అధికారం ఇవ్వాలని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE