తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులను ఖాళీ చేయించి, ఇళ్లకు పంపించవద్దని నిర్వాహకులకు తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు. ఈమేరకు మార్చ్ 24 , బుధవారం నాడు ప్రెస్ నోట్ విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో హాస్టల్లో ఉండే విద్యార్థులను బయటకు పంపకుండా పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు హాస్టళ్ల నిర్వాహకులతో మాట్లాడాలని ఆదేశించారు. రాష్ట్రంలో లాక్డౌన్ ను తీవ్రంగా పరిగణిస్తునందువలన ఇళ్లు విడిచి ఎవరూ బయటకు వెళ్లొద్దని సూచించారు. అలాగే వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు కొంతమంది విద్యార్థులకు ఇప్పటి వరకు పోలీసులు జారీ చేసిన అనుమతి పత్రాలు కూడా చెల్లవని డీజీపీ మహేందర్రెడ్డి స్పష్టం చేశారు.
మరోవైపు కొంతమంది విద్యార్థులకు నగర పోలీసులు అనుమతి పత్రాలు జారీ చేయడంతో వారు స్వస్థలాలకు బయలుదేరగా తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో వారిని ఆపేశారు. ఏపీ విద్యార్థులు, ఉద్యోగులు సొంత గ్రామాలకు వెళ్లేందుకు భారీగా సంఖ్యలో బయలుదేరగా వారిని గరికపాడు చెక్పోస్టు వద్ద పోలీసులు ఆపేశారు. అనంతరం ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు జరగ్గా వైద్య పరీక్షల అనంతరం వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని, అలాగైతేనే వారిని రాష్ట్రంలోకి అనుమతిస్తామని ఏపీ అధికారులు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. క్వారంటైన్ గడువు ముగిసిన తర్వాత మాత్రమే వారు ఇంటికి వెళ్లాల్సి ఉంటుందని పేర్కోవడంతో కొంతమంది అంగీకరించి ఏపీకి వెళ్లగా, మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ తిరిగివచ్చినట్టుగా సమాచారం.