కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా మార్చ్ 22, ఆదివారం నాడు జనతా కర్ఫ్యూ నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ కు ప్రజలంతా అద్భుతంగా స్పందించారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆదివారం నాడు కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన అనంతరం ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 31వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని, స్వచ్ఛందంగా స్పందిస్తూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని సీఎం కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:
- మార్చ్ 31వ తేదీ వరకు తెలంగాణలో లాక్డౌన్.
- రాష్ట్రంలో 87.59 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డులో ఉన్నప్రతి వ్యక్తికి 12 కేజీల రేషన్ బియ్యం ఉచితంగా అందజేత.
- అలాగే ప్రతి రేషన్ కార్డుకు నిత్యవసర వస్తువుల నిమిత్తం రూ.1500 నగదు అందజేస్తాం.
- నిత్య అవసరాల కోసం ఇంటి నుంచి ఒక వ్యక్తి మాత్రమే బయటకు రావాలి.
- రాష్ట్రంలో బార్లు, పబ్బులుతో పాటుగా మద్యం దుకాణాలు కూడా మూసివేత.
- ఆర్టీసీ బస్సులు, ఆటోలు, టాక్సీలు కూడా తిరగడానికి వీల్లేదు.
- 31 వరకు అంతర్రాష్ట్ర సరిహద్దుల మూసివేత.
- ఇతర రాష్ట్రాలనుంచి ప్రైవేటు వాహనాలు, వ్యక్తిగత వాహనాలు రాష్ట్రంలోకి అనుమతించడం లేదు.
- అత్యవసర విభాగాల ఉద్యోగులు తప్ప మిగతా ప్రభుత్వ ఉద్యోగులు 20శాతం రొటేషన్ పద్ధతిలో విధులకు హాజరు అవ్వాలి.
- ఈ సమయంలో ప్రైవేటు ఉద్యోగులకు ఆయా సంస్థలు వేతనం చెల్లించాలి.
- విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించి, ప్రభుత్వానికి సహకరించాలి. వారు బయటకు రాకుండా స్వీయ నిర్బంధంలోనే ఉండాలి.
- ప్రజలంతా ఎవరి ఇళ్లలో వాళ్లే ఉండాలి. బయటికి వచ్చి అనవసరమైన ఇబ్బందులు కొన్ని తెచ్చుకోకూడదు.
- ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న వాళ్ల కోసం ఆరువేల బృందాలు పనిచేస్తున్నాయి.
- ఒక వారం రోజులు ఆషామాషీగా తీసుకోకుండా బాధ్యతతో వ్యవహరిస్తే రాష్ట్రానికి, దేశానికి ఎంతో సేవ చేసిన వాళ్లమవుతాం.