దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మార్చ్ 26, గురువారం ఉదయానికి 26 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో మొత్తం 649 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. అలాగే కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు 13మంది మృతి చెందినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా మూడువారాల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. కాగా ఈ లాక్డౌన్ సమయంలో పేద ప్రజలకు ఊరట కల్పించేలా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పలు నిర్ణయాలు ప్రకటించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో గరీబ్ కల్యాణ్ స్కీమ్ పేరుతో రూ.1.70లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు చెప్పారు.
నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:
- గరీబ్ కల్యాణ్ స్కీమ్ పేరుతో రూ.1.70లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ.
- ఈ ప్యాకేజీతో వలస కార్మికులు, పట్టణ మరియు గ్రామీణ పేదలకు లబ్ది.
- ప్రభుత్వ పారిశుధ్య కార్మికులు, ఆశా కార్మికులు, వైద్యులు, పారామెడిక్స్, ఇతరులకు రూ .50 లక్షల మెడికల్ ఇన్సూరెన్సు. దీని ద్వారా 20 లక్షల మంది కార్మికులకు లబ్ధి.
- వచ్చే మూడు నెలల్లో అదనంగా 5 కిలోల బియ్యం లేదా గోధుమలు ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందిస్తుంది.
- వీటితో పాటుగా 1kg పప్పులు కూడా 80 కోట్ల మంది ప్రజలకు అందజేత.
- 8.69 కోట్ల మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చడానికి 2000 రూపాయలు వెంటనే విడుదల.
- ఉపాధిహమీ వేతనం రూ.182 నుంచి రూ.202కు పెంపు.
- ఉజ్వల పథకం కింద లబ్ధిదారులకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు.
- సీనియర్ సిటిజన్లు, వితంతువులు మరియు వికలాంగులకు రాబోయే మూడు నెలల్లో రెండు విడతలుగా 1000 రూపాయల అదనపు చెల్లింపు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 3 కోట్ల మంది ప్రయోజనం.
- 20 కోట్ల మంది మహిళ జాన్ ధన్ ఖాతాదారులకు వచ్చే మూడు నెలల్లో నెలకు రూ .500 ఎక్స్గ్రేషియా.
- వచ్చే మూడు నెలల పాటు 8.3 కోట్ల బిపిఎల్ కుటుంబానికి ఉచితంగా సిలిండర్లు సరఫరా.
- డ్వాక్రా మహిళా గ్రూపులకు రూ 20 లక్షల వరకూ రుణ సదుపాయం.
- రూ 15,000లోపు వేతనాలు కల్గిన చిన్న ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా పీఎఫ్లో ఉద్యోగుల వాటాను కేంద్ర ప్రభుత్వమే సమకూర్చనుంది.
- 100 కంటే తక్కువ మంది ఉద్యోగులున్న సంస్థల్లో, 90% మంది నెలకు 15,000 కన్నా తక్కువ వేతనాలు తీసుకుంటుంటే ఆ సంస్థలకు ప్రభుత్వమే కంపెనీ వైపు నుండి 12% మరియు ఉద్యోగుల వైపు నుండి 12% పిఎఫ్ ను సమకూర్చనుంది.
- ఉద్యోగులు తిరిగి చెల్లించే అవసరం లేకుండా 75 శాతం వరకు పీఎఫ్ డ్రా చేసుకోవచ్చు. 3 నెలల జీతం మొత్తం లేదా 75 శాతం పీఎఫ్లో ఏది తక్కుఉంటే దాన్ని ఉపసంహరించుకోవచ్చు.
- 3.5 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులకు లబ్ధి చేకూర్చే విధంగా 31,000 కోట్ల రూపాయల నిధిని వినియోగించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.
- ప్రకటించిన నిర్ణయాలన్నీ తక్షణమే అమలులోకి వస్తాయని ప్రకటన.