ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్చ్ 26, గురువారం సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్డౌన్ అమలు, పాటించాల్సిన పలు నియమాలపై రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా మరి కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశమున్నట్టుగా తెలుస్తుంది. ముందుగా సీఎం క్యాంపు కార్యాలయంలో లాక్డౌన్ అమలు, కరోనా వైరస్ నివారణ చర్యలపై అధికారులతో ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే నిత్యావసర వస్తువులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 10కి చేరింది. ఇప్పటికి 332 మంది సాంపిల్స్ పరీక్షించగా 289 మందికి నెగటివ్ వచ్చినట్లు తెలిపారు. అలాగే 33 మంది రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడం, లాక్డౌన్ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ ఆంధ్రప్రదేశ్కు వచ్చే ప్రయత్నం చేయవద్దని ఏపీ ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అలాగే ఏపీ నుంచి కూడా ఎవరూ వారి రాష్ట్రాలకు వెళ్లాలనే ప్రయత్నాలు కూడా చేయవద్దని సూచించింది. సొంత గ్రామాలకు వెళ్లిపోవాలనే ఆందోళన ప్రజలకు వద్దని, ఈ సమయంలో ఎక్కడివారు అక్కడే ఉండి, ప్రభుత్వాలకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని వార్తలు:
దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో పూర్తిస్థాయి లాక్డౌన్
దేశీయ విమాన సర్వీసులు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం
కరోనా ఎఫెక్ట్ : లోక్సభ, రాజ్యసభ నిరవధిక వాయిదా
కరోనా ఎఫెక్ట్: రాజ్యసభ ఎన్నికలు వాయిదా