వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం కీలక సమావేశం ఏర్పాటు చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించనున్న ఈ సమావేశానికి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు మరియు ప్రాంతీయ ఇన్చార్జులు హాజరవనున్నారు. ఈ సందర్భంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం పురోగతిపై సీఎం జగన్ శాసనసభ్యులు, ఇతర నేతల పనితీరును సమీక్షించనున్నారు. కాగా ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్లు, ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఓటమి పాలైన నేపథ్యంలో.. ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే వివిధ సర్వేల ద్వారా ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సీఎం జగన్ దానికి సంబంధించి వారికి కీలక సూచనలు చేయనున్నారు. అలాగే పార్టీ నియమించిన ‘గృహసారధులు’ పాత్రపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇక ఇప్పటికే జరిగిన గత సమావేశాలలో లక్ష్యాలను చేరుకోవడంలో వెనుకబడిన ఎమ్మెల్యేల పేర్లను వెల్లడించిన సీఎం జగన్.. వారు తమ పనితీరుని మెరుగు పరచుకోకుంటే వచ్చే ఎన్నికల్లో వారిని భర్తీ చేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే పని చేయని శాసనసభ్యులకు టిక్కెట్లు ఇవ్వబడవని బహిరంగంగా వెల్లడించడం పార్టీలో అలజడి రేపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మరోవైపు ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల్లో సొంత పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేశారని ఆరోపిస్తూ ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు.. ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరియు ఉండవల్లి శ్రీదేవిలను పార్టీ నుండి సస్పెండ్ చేయడం కూడా నేతల్లో కలవరం సృష్టించింది. అయితే పార్టీలో ఎలాంటి అసమ్మతి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు జరిగినా కఠినంగా వ్యవహరిస్తామని, గీత దాటితే ఎవరినీ విడిచిపెట్టేది లేదని స్పష్టం చేసేందుకు జగన్ పంపిన బలమైన సంకేతంగా ఈ చర్యను భావిస్తున్నారు.
మరోసారి మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ?
ఇక ఇదిలా ఉండగా మరోవైపు ఇటీవలి కాలంలో పార్టీకి ఎదురైన కొన్ని వరుస పరాజయాల నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు మంత్రుల పనితీరుపై సీఎం జగన్ అసహనంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో వారి స్థానంలో సమర్థులైన నాయకులను నియమించనున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిలో భాగంగా కుల సమీకరణలకు అనుగుణంగా మాజీ మంత్రుల్లో కొందరిని తిరిగి కేబినెట్లోకి తీసుకోవాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. నేటి సమావేశంలో ఈ అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE