భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం తెలంగాణ భవన్లో పార్టీ ప్రతినిధుల సమావేశం జరుగనుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సహా ఇతర రాష్ట్ర మంత్రులు సహా పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొత్తం 279 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 22 ఏళ్ల క్రితం హైదరాబాద్లోని జలదృశ్యం వేదికగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత సంవత్సరం విజయదశమి నాడు బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలలో కూడా పార్టీని విస్తరించే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టిన సీఎం కేసీఆర్.. ఇప్పటికే మహారాష్ట్రలో మూడు భారీ బహిరంగ సభల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఇక టీఆర్ఎస్, బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తరువాత జరుగుతున్న మొదటి ప్రతినిధుల సభ కావడంతో నేటి సమావేశం కీలకం కానుంది. ఈ ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. నేడు జరిగే ప్రతినిధుల సమావేశం ప్రాముఖ్యత సంతరించుకుంది. దీనికితోడు ఈనెల 30న కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డా. బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయం, అలాగే జూన్ 1న అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం జరుపుకోనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వీటి ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ క్రమంలో నేటి సమావేశంలో పలు కీలక రాజకీయ తీర్మానాలు, పార్టీ పరమైన తీర్మానాలు చేయనున్నారు. ఇటీవలే రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ జరిగిన క్రమంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE