చేవెళ్ల చెల్లెమ్మగా గుర్తింపు పొందిన పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి రాజకీయాల్లో ఓటమి ఎరుగని నేత. భర్త మాజీ మంత్రి ఇంద్రారెడ్డి మరణంతో 2000లో జరిగిన ఉప ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం తొలిసారిగా చేవెళ్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా గెలుపొందారు. పునర్విభజనలో చేవెళ్ల ఎస్పీకి రిజర్వ్డ్ కావడంతో మహేశ్వరం నియోజకవర్గానికి మకాం మార్చారు. 2009లో అక్కడ కూడా గెలిచారు. 2014లో మాత్రం కుమారుడి కోసం పోటీ నుంచి తప్పుకున్నారు. 2018లో మళ్లీ పోటీ చేసి గెలిచారు. టీఆర్ఎస్లోకి చేరి మంత్రి అయ్యారు. ఇప్పుడు మరోసారి మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
నియోజకవర్గంలో గులాబీ పార్టీకి కానీ, సబితారెడ్డికి ఇప్పటికీ ప్రజాదరణ ఉంది. అయితే చేవెళ్లకే చెందిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నుంచి అందెల శ్రీరాములు యాదవ్ పోటీలో ఉన్నారు. ఈసారి సబితకు పోటీ తీవ్రంగానే ఉండేలా కనిపిస్తోంది. లోకల్ – నాన్లోకల్ ఈ ఎన్నికల్లో బాగానే ప్రభావం చూపేలా కనిపిస్తోంది. సబిత, కేఎల్ఆర్ ఇద్దరూ మహేశ్వరానికి నాన్ లోకల్ అభ్యర్థులే. అందులోనూ వరుసగా రెండు సార్లు సబిత ఇక్కడి నుంచి గెలిచారు. దీంతో మూడోసారి ఎంత వరకు నెగ్గుకురాగలుగుతారో అన్న చర్చ జరుగుతోంది.
బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అందెల శ్రీరాములు స్థానికుడు. గత ఎన్నికల్లో పోటీ చేసి సబితా ఇంద్రారెడ్డికి గట్టిగానే పోటీ ఇచ్చారు. ఈ సారి మన నియోజకవర్గంలో.. మనోడికి అవకాశం ఇవ్వాలని ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సబితా ఇంద్రారెడ్డిపై కొంత వ్యతిరేకత కూడా ఉంది. ఆమె తనయుడు కార్తీక్రెడ్డి భూకబ్జాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నప్పటికీ నియోజకవర్గంలో కళాశాలల కొరత, పాఠశాలల్లో సదుపాయాల లేమి ఉందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ఓ సారి 400 మందికి ఒకే బాత్రూమ్ ఉందని విద్యార్థులు రోడ్డెక్కిన ఘటనలు ఉన్నాయి.
నియోజకవర్గంలో కులాల పరంగా ఓసీలు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో బీసీలు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి సబిత సామాజిక వర్గానికే కేఎల్లార్ పోటీ ఉండగా, అదే సామాజికి వర్గానికి చెందిన కొత్త మనోహర్రెడ్డి కూడా బీఎస్పీ నుంచి పోటీకి సిద్ధం అవుతున్నారు. ఆయన కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన ఆయన పలు సందర్భాల్లో మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, మంత్రి సబితారెడ్డిని ఓడించడమే తన ధ్యేయమని తెగేసి చెప్పారు. ఇప్పుడు తన రూటు మార్చుకుని.. ‘కొత్త’ దారిలోకి మళ్లారు. శుక్రవారం బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో చేరి సభ్యత్వం తీసుకున్నారు. ఒక గుర్తు కోసం ఆయన, బీఎస్పీని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మహేశ్వరంలో ఈసారి మంత్రి సబితారెడ్డిని ఓడిస్తానని శపథం చేస్తున్నారు. ఇన్ని ప్రతికూలతలను దాటుకుని సబిత ఈసారి ఎలా నెగ్గుకువస్తారో చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE