తెలంగాణ లో ఎన్నికల సమరం హోరెత్తాల్సిన సమయం.. కానీ.. ఇంకా కొన్ని పార్టీలు పొత్తుల లెక్కలు తేల్చుకోలేక పూర్తి జాబితా విడుదల చేయలేకపోతున్నాయి. అధికారంలోకి వచ్చే ఊపుమీదున్న కాంగ్రెస్ కూడా ఇంకా 19 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కమ్యూనిస్టుల పొత్తుల లెక్కలు ఇంకా కొలిక్కిరాలేదా.. అనేది తేలడం లేదు. ఇప్పటికే సీపీఎం బై చెప్పేసింది. సీపీఐ ఇంకా కాంగ్రెస్ను పట్టుకునే వేలాడుతూనే ఉంది. కానీ.. అధికారికంగా ఇంకా ఎటూ తేలలేదు. మరోవైపు బీజేపీ – జనసేన తకరారు కొనసాగుతూనే ఉంది. జనసేకు కొన్ని సీట్లు ఒకే చేసినట్లు చెబుతున్నా.. అధికారిక జాబితా ఇంకా రాలేదు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ చిత్రవిచిత్రాలు జరుగుతూనే ఉన్నాయి.
పార్టీ ఫిరాయింపులు, పొత్తులు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అసంతృప్త నేతల నుంచి కత్తులు విచ్చుకుంటున్నాయి. విపత్తులకు దారి తీస్తున్నాయి. కొందరిని చిత్తు చేస్తున్నాయి. పలు గమ్మత్తులు చోటు చేసుకుంటున్నాయి. ఒక పార్టీ జెండాను మార్చి మరోపార్టీ జెండాను భుజానికెత్తుకుంటున్న వారు రోజురోజుకూ పెరుగుతున్నారు. అందుకు ప్రధాన అజెండా ఉన్న పార్టీలో ఆశించిన టిక్కెట్టు రాకపోవడమే. ఎంతోకాలంగా ఎన్ని ఇబ్బందులెదురైనా పార్టీని వీడకుండా దాన్నే నమ్ముకున్న వారికి టిక్కెట్టు రాకపోవడం వల్ల బాధ పడి పార్టీ మారడాన్ని తప్పుబట్టలేం.
మరోవైపు ఎదుటి పార్టీని దెబ్బతీయడానికో లేక తాము గెలిచేందుకో రాజకీయంగా పలుకుబడి, ప్రాధాన్యత ఉన్న నేతలను తమ వైపులాక్కుంటున్న పార్టీలూ ఉన్నాయి. తమంత తాముగా మరోపార్టీపై మనసుపడి మారుతున్న వారూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరు ఏపార్టీలో ఉన్నారో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఎంతోకాలంగా ఒక పార్టీలో ఉన్న అభ్యర్థి పార్టీ మారిన విషయం తెలియని వాళ్లూ ఉన్నారు.అంతే కాదు నిన్న ఒక పార్టీలో ఉన్న వ్యక్తి ఇవాళ ఏ పార్టీలో ఉన్నాడోనని ఆలోచించే పరిస్థితి వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే ఆయా పార్టీలు కూడా ఎక్కడ తమ నాయకులు చేజారిపోతారేమోనని అభ్యర్థలు ప్రకటనకు ఆచితూచి ఆలోచిస్తున్నారు.
ప్రస్తుతం కనిపిస్తున్న గమ్మత్తుల్లో పొత్తులూ కత్తులూ ఉన్నాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు బీఆర్ఎస్తో పొత్తును ఆశించాయి. బీఆర్ఎస్ వాటి డిమాండ్ను పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకొని కాంగ్రెస్తో అంట కాగేందుకు అవి సిద్ధమయ్యాయి. అదుగో ఇదుగో అంటూ చివరాఖరుకు అవి కోరుకున్న సీట్లివ్వకపోవడంతో సీపీఎం కాంగ్రెస్తో కటీఫ్ చేసుకొని తొలి 17 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. సీపీఐ ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించకపోవడం ఆశ్చర్య కలిగిస్తోంది.
మరో రెండు పార్టీల పొత్తు ఫలితాన్నిస్తుందో లేదో తెలియని పరిస్థితి. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతాపార్టీ గెలిచే అభ్యర్థులు కరువయ్యో, మరో కారణమో కానీ ఏపీలోని జనసేనతో తెలంగాణలో పొత్తుకోసం తహతహలాడుతోంది. బీజేపీ జాతీయస్థాయి నేతలు అందుకు జనసేన అధినేత వద్దకు వెళ్లి సంప్రదింపులు జరపడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇప్పుడు దాదాపు డజనుకుపైగా సీట్లను జనసేనకు కట్టబెట్టేందుకు అది సిద్ధమవుతోంది. మరోవైపు జనసేనాని మాత్రం 33 సీట్లలో పోటీ చేయాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే జనసేనకు కేటాయించబోయే నియోజకవర్గాలపై ఆశలు పెట్టుకున్న నాయకులు బీజేపీకి శత్రువులయ్యే ప్రమాదం పొంచిఉంది. దీంతో ఈ పొత్తు ఎవరో ఒకరికి విపత్తుగా మారనుంది. ఇలా రోజుకో మలుపులు తిరుగుతూ ఔరా అనిపిస్తున్న రాజకీయచిత్రాలు నామినేషన్లు ముగిసేంత దాకా కొనసాగుతాయేమో వేచిచూడాల్సిందే!
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE