ఏపీలో శాసన సభ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా ఒకేసారి జరుగుతుండటంతో బీజేపీ హైకమాండ్ గెలుపుపైనే దృష్టి పెట్టి.. ఆవిధంగానే సన్నాహాలు మొదలు పెట్టింది.దీనిలో భాగంగానే ఏపీలోని 25 జిల్లాలను ఐదు క్లస్టర్లుగా విభజించి, వాటికి ఇన్చార్జిలతో పాటు సహ ఇన్చార్జిలను కూడా నియమించింది.
అలాగే ఆంధ్రప్రదేశ్లోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంయోజకులు, ప్రభారీల నియామకాన్ని కూడా జరిపింది. అయోధ్య ప్రాణ ప్రతిష్ట తర్వాత పొత్తులపై నిర్ణయాన్ని తీసుకుంటామని గతంలో చెప్పిన బీజేపీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తలేదు. పైగా పొత్తుల అంశం కొలిక్కి రాకముందే.. అనూహ్యంగా 25 పార్లమెంట్ నియోజవర్గాలలో నియామకాలు చేపట్టడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ఏపీలో బీజేపీ ఏ పార్టీతోనూ ఇప్పుడు పొత్తు పెట్టుకోవద్దని డిసైడ్ అయ్యిందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఎన్నికల కోలాహలం అంతా వైసీపీ, టీడీపీ, జనసేన మధ్యలోనే కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులలో బీజేపీకి అధికారంలోకి వచ్చే అవకాశం ఏమాత్రం ఉండదన్న విషయం కమలం పెద్దలకు అర్ధం అయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.దీంతోనే ఇప్పుడు ఏ పార్టీతో అయినా పొత్తులు పెట్టుకుంటే ఆ ప్రభావం.. ఎంపీ ఫలితాలపై పడే అవకాశం ఉందని ఆలోచించి పొత్తుల ప్రస్తావన తీసుకురాకుండానే పార్లమెంట్ నియోజవర్గాలలో నియామకాలు చేపట్టిందన్న వాదన వినిపిస్తోంది.
ఎందుకంటే ఏపీలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో ఎవరూ అంచనా వేయలేరు. ప్రస్తుతం బీజేపీ అటు అధికార వైసీపీతో, ఇటు విపక్షాలతో మంచి సంబంధాలే కొనసాగిస్తూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా లోక్ సభ ఎన్నికలకు వెళ్లి..ఆ తర్వాత ఏ పార్టీకి ఎక్కువ ఎంపీ స్థానాలు వస్తాయో వారికి దగ్గర అయితే, కేంద్రంలో ఇంకొంత బలం తోడు అవుతుందన్న లెక్కల్లో కమలం పెద్దలు ఉన్నారు. దీంతోనే ఇప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటన చేయకుండానే పార్లమెంటు ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ