ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఇటు అధికార పార్టీకి, అటు తెలుగుదేశానికి జీవన్మరణ సమస్యగా మారింది. మరోసారి ఎవరు అధికారంలోకి వచ్చినా అవతలివారికి ఇబ్బందులు తప్పవనే దిశగా ప్రస్తుత రాజకీయాలు ఉన్నాయి. ఈ క్రమంలో గెలుపు కోసం ఇరుపార్టీలు తీవ్రమైన స్థాయిలో వ్యూహాలు రచిస్తున్నాయి. పార్టీలు, అధినేతల పరంగా ప్రజల్లో అభిప్రాయాలు ఎలాగున్నా.. నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల బలాబలాలు కూడా ముఖ్యమని నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపనున్నారు. ప్రజల్లో మంచి పేరు మాత్రం ఉంటే సరిపోదని, ఎన్నికల వేళ వారిని అన్ని రకాలుగానూ మెప్పించే వారై ఉండాలని ఆయా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్థికంగా కూడా బలవంతుడై, డబ్బు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడని వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నాయి.
ఇప్పటికే పార్టీలు అభ్యర్థుల విషయంలో కొన్నిచోట్ల ఓ అంచనాకు వచ్చాయి. మెజారిటీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం తీవ్రమైన కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం డబ్బు రాజకీయాలకు ప్రాధాన్యం పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికలో ఈ విషయాన్నే పార్టీలు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ప్రధాన పార్టీలన్నీ అదే కోవలో ఉన్నాయనేది వాస్తవం. ఈ విషయంలో అధికారంలో ఉన్న కొంచెం ఎక్కువగానే ఆలోచిస్తోంది. ఆర్థిక వనరుల లేమి అనే పేరుతో పార్టీ కోసం ఏళ్ల తరబడి నుంచి పని చేస్తున్న వారిని కూడా పక్కకు పెడుతున్నట్లు తెలుస్తోంది. వారికి నామినేటెడ్ పదవులు ఇస్తానని హామీ ఇస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రస్తుతానికి పదింటికి పార్టీ ఇన్చార్జిల పేరుతో అభ్యర్థులను ఖరారు చేశారు. ఆ సందర్భంగా వైసీపీ అనుసరించిన తీరును పరిశీలిస్తే ఆర్థిక స్థోమతే ప్రధాన ఆయుధంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోంది.
అధికార పార్టీలో ఇప్పటికే నియోజకవర్గాల వరకు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఐదు దఫాలుగా విడుదల చేసిన జాబితాలలోని ఇన్చార్జిలనే అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉంది. ఆయా అసెంబ్లీల వారీ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల్లో ఖర్చు పెట్టే వ్యయంపై ముందుగానే హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం రూ. 50 కోట్ల ఖర్చుకు సిద్ధంగా ఉండాలని చెబుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఉదాహరణకు ప్రకాశం జిల్లాలోని ఓ ఒక నియో జకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ను తొలుత మీ నియోజకవర్గంలో రూ.40 కోట్లు ఖర్చుపెట్టాలి. కనీసం మీరు రూ.30కోట్లు చూసు కుంటే రూ.10కోట్ల సహకారం అందిస్తామంటూ ఐప్యాక్ ప్రతినిధులు చర్చలు జరిపినట్లు తెలిసింది. ‘ఇప్పటికే మూడు ఎన్నికల్లో ఉన్నదంతా పెట్టా.. అప్పు లు తీర్చేందుకు ఆస్తులు అమ్మా. రూ.10 కోట్లకన్నా మించి పెట్టలేను’ అని ఆయన తేల్చిచెప్పినట్లు తెలిసింది.
అలాగే.. తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేసేందుకు సిద్దం అవుతున్నాయి. గెలుపులో డబ్బు పాత్ర ప్రముఖం కావడంతో ఆయా పార్టీలు కూడా కోటీశ్వరులకే సీట్లు కేటాయించేందుకు సిద్ధం అవుతున్నాయి. ఆయా పార్టీల్లో ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థులను పరిశీలిస్తే ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నవారే అని స్పష్టం అవుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE