సొంత ఇంటి నిర్మాణం కోసం కూడపెట్టిన డబ్బు చెదలు పట్టి చిత్తు కాగితాలుగా మారాయి. ట్రంకు పెట్టెలో ఏకంగా 5 లక్షలు రూపాయలు దాచిపెడితే ఆ డబ్బుకి చెదలు పట్టడంతో ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని మైలవరంలో చోటుచేసుకుంది. మైలవరం వాటర్ ట్యాంక్ వద్ద పందుల వ్యాపారం చేసుకునే బిజిలి జమలయ్య తన వ్యాపారంలో వచ్చిన లాభాలను బ్యాంక్ అకౌంట్ లేకపోవడంతో కుటుంబ సభ్యులను నమ్మలేక ట్రంకు పెట్టెలో దాచిపెట్టి భద్రం చేసుకున్నాడు. ఒక పది లక్షలు పోగు చేసి మంచి ఇల్లు కట్టుకుందామనుకున్నాడు. సుమారు 5 లక్షల రూపాయలు దాచిపెట్టాడు. అకస్మాత్తుగా వ్యాపారానికి ఒక లక్ష కట్టాల్సి వచ్చి రాత్రి తన ట్రంకు పెట్టె తెరిచాడు. లోపలున్న డబ్బులు చెదలు పట్టి ఉండడాన్ని చూసి ఒక్కసారిగా బావురుమన్నాడు.
ఉదయాన్నే ట్రంకు పెట్టెలో చెదలు పట్టిన డబ్బు తీసి మంచంపై వేసి లెక్కపెట్టడం ప్రారంభించారు. చుట్టుప్రక్కల వారికి తెలియడంతో ఈ సమాచారం పోలీసులకు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జమలయ్య ఇంటికి వెళ్ళి ఆరా తీశారు. పోలీసులను చూడడంతోనే జమలయ్య కుటుంబీకులు తమ బాధను చెప్పుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వారిని వేడుకున్నారు. అక్కడ చెదలు పట్టిన నోట్లతో చిన్న పిల్లలు ఆడుకోవడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. అయితే అసలు ఇది వీరి సొంత డబ్బేనా? లేక ఎక్కడైనా దొరికాయా అనే విషయంతో పాటుగా, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ