జనసేన పార్టీకి మరో సీనియర్ నాయకుడు ఆకుల సత్యనారాయణ గుడ్ బై చెప్పారు. గత కొంత కాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీరు పట్ల అసంతృప్తి ఉన్న ఆయన అక్టోబర్ 5, శనివారం నాడు పార్టీకి రాజీనామా చేసారు. ఆయన సతీమణి ఆకుల లక్ష్మీ పద్మావతి కూడ రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పార్టీ అధిష్టానానికి పంపించారు. తన రాజకీయ భవిష్యత్ పై త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిపారు. 2014 ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుండి బీజేపీ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2019 ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరి రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పొందారు. ఫలితాల తరువాత కొన్ని నెలల నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన ఆయన ఎట్టకేలకు రాజీనామా చేసారు. వైసీపీ నాయకులతో చర్చించిన తరువాత, ఆ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.
ఎన్నికలలో జనసేన పరాజయం పొందిన అనంతరం, పలువురు సీనియర్ నాయకులు పార్టీని వీడడం మొదలు పెట్టారు. ఇప్పటికే రావెల కిషోర్బాబు, మారంశెట్టి రాఘవయ్య, చింతల పార్థసారథి, అద్దేపల్లి శ్రీధర్, డేవిడ్ రాజు తదితరులు జనసేన పార్టీకి గుడ్బై చెప్పారు. తాజాగా ఆకుల సత్యనారాయణ కూడ పార్టీకి రాజీనామా చేయడంతో ఆందోళన చెందుతున్న జనసేన కార్యకర్తలు, నాయకులు పార్టీ నిర్ణయాలపై, భవిష్యత్ కార్యాచరణపై ఇకనైనా దృష్టి సారించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు.
[subscribe]