తెలంగాణ లో హుజుర్నగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 4, శుక్రవారం నాడు సూర్యపేట జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) వెంకటేశ్వర్లును బదిలీ చేసింది. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ ఆయన్ను బదిలీ చేసింది. వెంకటేశ్వర్లను హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఈసీ ఆదేశాలు జారీచేసింది. మరో వైపు ఎన్నికలకు సంబంధించిన విధులను ఆయనకు అప్పగించవద్దని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. వెంకటేశ్వర్లు స్థానంలో ప్రస్తుతం భూపాలపల్లి ఎస్పీగా పనిచేసున్న ఆర్.భాస్కరన్ ను సూర్యాపేట జిల్లా ఎస్పీగా నియమించారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ గురువారం నాడు ఢిల్లీలో ఈసీ అధికారులను కలిసారు. రాష్ట్ర మంత్రులు జిల్లా ఎస్పీ, కలెక్టర్లను అడ్డుపెట్టుకుని హుజుర్నగర్లో పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదు చేసారు.ఈ ఎన్నికలలో పోటీ చేయాలని భావించిన సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు భూమన్నపై కూడ పోలీసులు అక్రమకేసులు పెట్టి వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా ఎస్పీని బదిలీ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. మరో వైపు ఎస్పీని బదిలీ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకోవడాన్ని కాంగ్రెస్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి స్వాగతించారు. ఈ ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టాలని ఈసీకి సూచించారు.
[subscribe]