రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు 21 రోజులుగా ఆందోళనలు చేసున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాలో ఉంటున్న ప్రవాసాంధ్రులు నుంచి అమరావతి రైతులకు మద్దతు లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ కాలిఫోర్నియాలో ఉండే ప్రవాసాంధ్రులు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాశారు. ఏపీ రాజధాని తరలింపు అంశంపై స్పందించి, అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు న్యాయం జరిగేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు. అమరావతి రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని, రాజధానిని విశాఖ తరలించడం వల్ల కలిగే ఇబ్బందులను ఈ లేఖలో పేర్కొన్నారు.
‘2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజన తర్వాత ఎన్నికైన ప్రభుత్వం అన్ని సౌకర్యాలకు అనుగుణంగా ఉంటుందనే అమరావతిని రాజధాని ప్రాంతంగా ఎంపిక చేసింది. రోడ్డు రవాణా, రైల్వే, విమానాశ్రయం, ఇతర అన్ని వనరులను పరిశీలించిన తర్వాతే అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. ఈ నిర్ణయానికి ఏపీ అసెంబ్లీ, అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి. 2015 అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అమరావతి నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం ఆ ప్రాంతంలోని వ్యవసాయంపై ఆధారపడిన 29 పరిసర గ్రామాల రైతుల నుంచి 33వేల ఎకరాలను తీసుకుంది. రైతులు కూడా స్వచ్ఛందంగా తమ ప్రాంత అభివృద్ధిని కోరుకుని భూములను ఇచ్చారు. అయితే ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానులు ప్రతిపాదనలు తేవడంతో, ప్రభుత్వ కార్యాలయాలు అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలే అవకాశం ఉంది. అలా జరిగితే రైతులు ఇబ్బందులకు గురిఅవుతారని’ రాష్ట్రపతికి రాసిన లేఖలో ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు.
[subscribe]