కరోనా నియంత్రణ చర్యల్లో దేశవ్యాప్తంగా సుదీర్ఘ లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ధిక వ్యవహారాలపై ప్రభావం పడుతున్నప్పటికీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలను యధాతధంగా కొనసాగిస్తున్నారు. ఇటీవలే వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్రంలోని ఒక్కో రైతు ఖాతాలో మొదటి విడత కింద ముందుగా వేసిన రూ.2000 వేలతో కలిపి మొత్తం రూ.7500 నేరుగా జమచేశారు. ఇక జూన్ మొదటివారంలో ‘జగనన్న చేదోడు’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
నాయీ బ్రహ్మణులకు, రజకులకు, టైలర్లకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశ్యంతో ‘జగనన్న చేదోడు’ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతీ ఏడాది రూ.10వేల చొప్పున ఐదేళ్లపాటు వారికి ఆర్థిక సాయం అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయీ బ్రహ్మణులకు, టైలర్లకు, రజకులకు ఈ పథకాన్ని అమలుచేయనున్నారు. లబ్దిదారుల ఎంపిక దాదాపుగా పూర్తవగా, సుమారు 2,50,015 మంది అర్హత సాధించినట్టుగా తెలుస్తుంది. మే 25 తేదీ కల్లా దశలవారీగా గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల పేర్ల జాబితాను ప్రదర్శించనున్నారు. లాక్డౌన్ కారణంగా వీరు ఆర్ధికంగా నష్టపోయిన నేపథ్యంలో త్వరలో ప్రభుత్వ సహాయంతో వారికీ కొంత ఉపశమనం కలిగే అవకాశముందని ప్రభుత్వం భావిస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu