ఎల్జీ పాలిమర్స్ నుంచి విడుదలైన విష వాయువు స్టెరిన్ ప్రజా జీవితంపై దుష్పభావం చూపించినా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధిత ప్రజలకు ధైర్యం ఇచ్చేలా లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. స్టెరిన్ వల్ల ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు, విష వాయువు ప్రభావిత ప్రాంత గ్రామాల ప్రజలకు న్యాయం చేసే విషయంలో ప్రభుత్వం సక్రమంగా స్పందించకపోతే పోరాడతామని ఆయన తెలిపారు. లాక్డౌన్ అనంతరం ప్రజా జీవితం సాధారణ స్థితికి వచ్చిన వెంటనే ఎల్జీ పాలిమర్స్ ప్రభావిత ప్రజల కోసం, భవన నిర్మాణ కార్మికుల కోసం చేసిన తరహాలోనే ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. మే 18, సోమవారం నాడు విశాఖపట్నం జిల్లా నాయకులు, శ్రేణులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ కాన్ఫరెన్స్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన ఆందోళనకరమైనది. ఆ పరిశ్రమ నుంచి విడుదలైన విష వాయువు స్టెరిన్ ప్రభావం ఇంకా ఎంత కాలం, ఏ స్థాయిలో ఉంటుందో అన్న భయాందోళనలు ప్రజల్లో ఉన్నాయి. పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారన్నారు. అలాగే విలువైన ప్రభుత్వ భూములను వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆ భూముల వాస్తవ విలువలు ఏమిటి, వేలం వెనక అసలు వ్యవహారం ఏమిటో ప్రజలకు తెలియాలన్నారు. ప్రభుత్వ భూముల వేలం, అధిక విద్యుత్ బిల్లులు, మద్యం అమ్మకాలుపై జనసేన నాయకులందరూ చర్చించుకొని సమష్టిగా క్షేత్ర స్థాయి నుంచి పోరాడాలని చెప్పారు. మరోవైపు సంపూర్ణంగా మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన పార్టీ అధికారంలోకి వచ్చాక ఏమి చేస్తుందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.. కేవలం అధికారం కోసమే అలాంటి హామీలు ఇచ్చారనిపిస్తోంది. ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలోనూ ఆశలు రేపి ప్రజలను మభ్యపెట్టకూడదు. అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందో లేదో గమనిస్తూ అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో పార్టీ నాయకులు, శ్రేణులు పరిశీలిస్తూ ఉండాలని చెప్పారు. అలాగే విశాఖపట్నం జిల్లాకు చెందిన అనస్తీషియా డాక్టర్ సుధార్ విషయంలో ప్రభుత్వం పెద్ద మనసుతో వ్యవహరించి విధుల్లోకి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu