లాక్డౌన్ 4.0 ను మే 31 వ తేదీవరకు పొడిగిస్తూ కంటైన్మెంట్ జోన్స్ ప్రాంతాల మినహా రాష్ట్రాల మధ్య మరియు రాష్ట్రంలో బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడుపుకునేందుకు ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారం ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులతో పాటుగా ప్రైవేట్ బస్సులను కూడా నడపాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. కరోనా నియంత్రణ చర్యలు, లాక్డౌన్ మార్గదర్శకాలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బస్సు సర్వీసులు, వ్యక్తిగత వాహనాలపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ముందుగా హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాల నుంచి రాష్ట్రంలోకి రావాలనుకుంటున్నవారికి బస్సులు ఏర్పాటుపై చర్చించారు. బస్సుల్లో ప్రయాణించే వారందరూ తప్పనిసరిగా మాస్కు ధరించేలా చూడాలన్నారు. ముందుగా ఒక బస్టాండ్ నుంచి మరొక బస్టాండ్కు మాత్రమే బస్ సర్వీసులు నడుస్తాయని, బస్సులో ప్రయాణించేవారి పూర్తి వివరాలు సేకరించాలని ఈ రోజు సమావేశం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ సూచించారు. బస్టాండ్లో దిగిన తరువాత వారికి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
వలస కార్మికుల తరలింపు పూర్తయ్యాక రాష్ట్రంలో బస్సు సర్వీసులు నడపాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికులను సగం సీట్లలోనే నింపి, అన్ని జాగ్రత్తలతో బస్సులను నడపాలని సూచించారు. ఇక ప్రతీ ఆర్టీసీ బస్సులో కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఇస్తూ, బస్సులో కచ్చితంగా భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏపీలో బస్సు సర్వీసులు, ప్రైవేట్ బస్సులు ఎప్పటినుంచి మొదలవుతాయనేది మూడు, నాలుగు రోజుల్లో ప్రకటించనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu