ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు.. నైట్ కర్ఫ్యూ విధిస్తూ గత వారం ఉత్తర్వులు వెలువరించిన నేపథ్యంలో నేటి నుంచి ఈ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఈ నెల 31 వరకూ ఇవి అమలులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా.. రోజూ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 వరకు కర్ఫ్యూ ఉంటుంది. అయితే, అత్యవసర విధుల్లో ఉండే ఆసుపత్రులు, మెడికల్ ల్యాబ్లు, ఫార్మసీ రంగాలతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలీ కమ్యూనికేషన్లు, ఇంటర్నెట్ సర్వీసులు, ఐటీ సంబంధిత సేవలు, పెట్రోల్ బంకులు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్య సిబ్బందికి మినహాయింపు ఉంటుంది. అదే విధంగా, న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది, స్థానిక సంస్థలకు చెందిన సిబ్బందికి కూడా ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే.. వారు విధి నిర్వహణలో గుర్తింపు కార్డును చూపాల్సి ఉంటుంది.
కొత్త కోవిడ్ నిబంధనలు
ఇకనుంచీ బహిరంగ ప్రదేశాల్లో ప్రజలందరూ మాస్క్లు ధరించాలి. మాస్క్లు ధరించని వారికి రు.100 జరిమానా విధిస్తారు. వివాహాలు, శుభకార్యాలలో.. బహిరంగ ప్రదేశాల్లో అయితే గరిష్టంగా 200 మంది, ఇన్డోర్లో 100 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. సినిమా హాళ్లలో సీటు వదిలి సీటు విధానాన్ని పాటిస్తూ ప్రేక్షకులందరూ మాస్క్ ధరించాలి. ఇక ప్రజారవాణా వాహనాల్లో సిబ్బందితో పాటు, ప్రయాణికులూ మాస్క్లు ధరించాలి. వ్యాపార, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు తమ ఆవరణలో ఉన్న వారంతా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధిస్తారు.
అలాగే, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ వంటి ప్రదేశాల్లో కోవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే జరిమానాతో పాటు ఒకటి లేదా రెండు రోజులపాటు షాపులు, మార్కెట్లు మూసివేసేలా చర్యలు ఉంటాయి. దేవాలయాలు, ప్రార్థన మందిరాలు, మతపరమైన ప్రదేశాలలో కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలి. భక్తులు భౌతిక దూరం. మాస్క్లు ధరించటం తదితర జాగ్రత్తలు పాటించాలి. జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, సూపరింటెండెంట్లు ఈ నిబంధనల అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఐపీసీ సెక్షన్ 188 కింద చర్యలు ఉంటాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ