మూడురాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు, మహిళలు చేపడుతున్న నిరసనలు, ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. రాజధాని ప్రాంత రైతుల జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు సకలజనుల సమ్మెను కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా మందడం గ్రామం నుండి సచివాలయం కు వెళ్లే దారిలో మహిళలు రోడ్డు పైన భైఠాయించారు. ఈ నేపథ్యంలో మహిళల్ని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, వారి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
అనంతరం ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల వాహనాన్ని వెళ్లనీయకుండా గ్రామస్తులు అడ్డుకుని వాహనం ముందు రోడ్డుపైనే పడుకున్నారు. ఈ క్రమంలో బస్సు ముందుకు వెళ్లటంతో ఒక రైతు చేతికి గాయాలయ్యాయి. పోలీసులుకు వ్యతిరేకంగా మందడం గ్రామస్థులు నినాదాలు చేస్తూ, వ్యాన్ లోకి ఎక్కించిన మహిళలను వెంటనే వదిలేయాలంటూ ఆందోళనకు దిగారు. గ్రామస్తులు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని నిరసనలు తెలపడంతో పోలీసులు సైతం భారీగా మోహరించారు. కొంత సమయం తరువాత వ్యాన్ ఎక్కించిన మహిళలను పోలీసులు కిందకు దించివేయడంతో ఉద్రిక్త పరిస్థితి సద్దుమణిగింది.
[subscribe]