సంక్రాతి పండగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తుంది. పండుగను పురస్కరించుకుని 1500 ప్రత్యేక సర్వీసులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. గతంలో సంక్రాంతి సమయంలో ఏపీఎస్ఆర్టీసీ 2 వేలకుపైగా బస్సులు నడపగా, ప్రస్తుత కరోనా పరిస్థితుల వలన బస్సులను తగ్గించనుంది. పండుగకు ఎన్ని బస్సులు నడపాలనే అంశంపై బుధవారం నాడు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు అన్ని జిల్లాల ఆర్టీసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల రద్దీ డిమాండ్ కు అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడపాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అత్యధిక సర్వీసులు హైదరాబాద్ నుంచి తిప్పేలా ప్రణాళిక రూపొందించారు.
హైదరాబాద్ నుంచి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు ఇప్పటికే రిజర్వేషన్స్ పుల్ అయినట్టు తెలిపారు. ఈ జిల్లాలకు అధిక డిమాండ్ ఉన్న కారణంగా ఎక్కువ ప్రత్యేక బస్సులు నడపనున్నారు. పండుగ సమయంలో ఎంజీబీఎస్ లో రద్దీని తగ్గించేందుకు ఏపీఎస్ఆర్టీసి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలు సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు వెళ్లే బస్సులను గౌలిగూడ సిటీ బస్ టెర్మినల్ నుంచి బయలుదేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు వెళ్లే బస్సులు ఎంజీబీఎస్ కి వెళ్లకుండా బిహెచ్ఎంఎల్, కేపీహెచ్బీ, ఎల్బీనగర్, ఈసీఐఎల్ నుంచి నేరుగా వెళ్లేలా ఏర్పాట్లు చేయనున్నారు. మరోవైపు తమిళనాడులోని చెన్నై, కర్ణాటకలోని బెంగళూరుకు కూడా పండుగ సమయంలో ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్దమయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ