ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. డీజిల్ సెస్ పెంపుతో నేటి (జూలై 1) నుంచి బస్సు ఛార్జీలు పెరుగుతున్నాయి. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎపిఎస్ ఆర్టీసీ ఛైర్మన్ ఎ మల్లికార్జునరెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంధనం ధరలు విపరీతంగా పెరగడంతో జూలై 1 నుంచి బస్సు టిక్కెట్లపై డీజిల్ సెస్ను స్వల్పంగా పెంచినట్లు తెలిపారు. జూన్ 29 నాటికి డీజిల్ (బల్క్) ధర లీటర్కు రూ.131కి పెరగడంతో, డీజిల్ సెస్ను స్వల్పంగా పెంచాలని ఆర్టీసీ నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. డీజిల్ ధర పెంపుతో ఆర్టీసీకి రోజుకు రూ.2.5 కోట్లు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు. అంతేకాకుండా బస్సుల విడిభాగాల ధరలు, లూబ్రికెంట్లు మరియు ఇతర ఖర్చులు కూడా పెరిగాయని, ప్రజలు పరిస్థితిని అర్థం చేసుకుని ఆర్టీసీకి సహకరించాలని ఆయన కోరారు.
మరోవైపు బస్పాస్ ఛార్జీలను సైతం 20 శాతం మేర పెరగనుంది. ఒక్కో టికెట్పై డీజిల్ సెస్ పెంపును శ్లాబ్ విధానంలో అమలు చేయనున్నారు. దీనిప్రకారం.. ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ.5 వరకు, పల్లెవెలుగు బస్సుల్లో 35-60 కి.మీ వరకు రూ.5 పెరిగాయి. అలాగే 60-70 కి.మీ వరకు అదనంగా రూ.10 వరకు పెరిగింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో గరిష్టంగా రూ. 20-25 వరకు పెరిగాయి. ఎక్స్ప్రెస్ బస్సుల్లో గరిష్టంగా రూ. 90 పెరిగాయి. సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.120, ఏసీ బస్సుల్లో రూ.140 వరకు చార్జీలు పెరిగాయి. ఇక నుంచి ఏసీ బస్సుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లాలంటే రూ.80, సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.70 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక తాజాగా డీజిల్ సెస్ పెంపుతో రోడ్డు రవాణా సంస్థకు రూ.1500 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ సీనియర్ అధికారులు చెబుతున్నారు. కాగా దీనికి ముందు ఏప్రిల్ 13న ఏపీఎస్ ఆర్టీసీ డీజిల్ సెస్ను స్వల్పంగా పెంచింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ