ఏపీ అసెంబ్లీ సమావేశాలు గరంగరంగా సాగుతున్నాయి. ఈ రోజు అసెంబ్లీ ప్రారంభంలోనే.. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జంగారెడ్డిగూడెంలో ఈ మధ్యకాలంలో సంభవిస్తున్న వరుస మరణాలపై చర్చించాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఈ అంశంపై వెంటనే చర్చకు అనుమతించాలని నినాదాలు చేశారు. సభలో టీడీపీ పక్షనేత అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ సభ్యులు తమ వద్ద ఉన్న కాగితాలను చింపివేసి స్పీకర్ పోడియంపై పడవేశారు. దీంతో, స్పీకర్ సభను కొంతసేపు వాయిదా వేసారు. కొంతసేపటి తర్వాత తిరిగి సభ ప్రారంభమైంది. అయితే, టీడీపీ సభ్యులు మాత్రం తమ నిరసనను కొనసాగించారు. టీడీపీ సభ్యుల ఆందోళనలతో మార్షల్స్ స్పీకర్ పోడియం వద్దకు చేరుకొని అడ్డుకున్నారు.
దీనిపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. సభకు కొన్ని నియమాలు ఉంటాయని, ఇష్టారాజ్యంగా మార్చటం కుదరదని అన్నారు. టీడీపీ సభ్యులు సభ నియమావళి ప్రకారం నడుచుకోవాలని, అప్పుడు ఈ అంశంపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం తరుఫున స్పీకర్ తెలిపారు. అయితే, టీడీపీ సభ్యులు మాత్రం, ఇది చాల తీవ్రమైన అంశమని, దీనిపై ఈరోజే చర్చించాలని పట్టుబట్టారు. ఈ సమయంలో మంత్రి కొడాలి నాని జోక్యం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెంలోవి సహజ మరణాలని, వాటిని కల్తీసారాకు ముడి పెడుతున్నారని టీడీపీ సభ్యులపై మండిపడ్డారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వ్యవహారాలకు అడ్డు తగులుతున్న టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని స్పీకర్కు సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ