ఉత్తరాంధ్ర ప్రాంత నీటి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. “ఉత్తరాంధ్రలో ఎటువైపు చూసినా నిర్మాణం పూర్తికాని మొండి గోడలు, లేదా చుక్కనీరు లేని కాల్వల వ్యవస్థ, ప్రాజెక్టు ప్రధాన కాల్వల వద్ద గ్రోయిన్స్ నిర్మాణం కాకపోవడంతో సాగునీటి కోసం ఉత్తరాంధ్ర రైతు ఎదురు చూపులు చూడడం గోచరిస్తుంది. అదేవిధంగా సాగునీరు లేక మంచి మాగాణి భూములు కూడా ఎడారిని తలపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు విషయంలో ప్రభుత్వం ఒక రూట్ మ్యాప్ ప్రకటించాలని బహిరంగ లేఖ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. దశాబ్దాల తరబడి ప్రాజెక్టులు పెండింగ్ లో పెడితే లక్ష్యాల మాట దేవుడెరుక ఇప్పటి వరకు వ్యయం చేసిన ప్రజాధనానికి ఎవరు సమాధానం చెబుతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరాంధ్ర విస్తీర్ణంలో నాల్గొవ వంతు ఉంటుంది, అంతటి విస్తీర్ణం కలిగిన ఉత్తరాంధ్రకు సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్ లో పెట్టడానికి కారణం ఎవరు అని” అని సోము వీర్రాజు ప్రశ్నించారు.
ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పునరావాస ప్యాకేజీ అమలు చేయరని, కాల్వల నిర్మాణం జరగదని, కాల్వలు నిర్మాణం జరిగితే గ్రోయిన్స్ నిర్మాణం చేయరని సోము వీర్రాజు అన్నారు. ప్రతి ప్రాజెక్టు ఏదో దశలో పెండింగ్ లోనే ఉంచారన్నారు. వంశధార ప్రాజెక్టు 19 టిఎంసిల ప్రాజెక్టు అయితే ప్రస్తుత 9 టిఎంసిల సామర్ధ్యం మాత్రమే ఉందని, సుమారు 45 కోట్లు వ్యయం చేస్తే ప్రాజెక్టు పూర్తిగా అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చని చెప్పారు. ఉత్తరాంధ్రలో 50 సంవత్సరాల క్రితం మూడు ప్రాజెక్టులకు ప్రణాళికలు రూపొందిస్తే నేటికీ ఆప్రాజెక్టులు కేవలం ఎన్నికల సమయంలో ఎజెండాగా మారుతున్నాయి తప్ప ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. వంశధార, నాగావళి నదులు అనుసంధాన ఎందుకు చేయడం లేదని, నేరడి బ్యారెజ్, గుట్టా బ్యారెజ్, మహేంద్రతనయపై ఆఫ్ షోర్ రిజర్వాయర్, మేఘాద్రిగడ్డ వంటి వాటి విషయంలో ముఖ్యమంత్రి వైఖరి స్పష్టం చేయాలని బహిరంగ లేఖ ద్వారా డిమాండ్ చేస్తున్నానని సోము వీర్రాజు లేఖలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ