ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20, సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర రాజధాని, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం, పరిపాలనా వికేంద్రీకరణ దృష్ట్యా మూడు రాజధానుల ఏర్పాటుకు అనుకూలంగా హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోదం తెలిపింది. అలాగే మంత్రివర్గ సమావేశంలో సీఆర్డీఏ రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి వంటి కీలక బిల్లులకు ఆమోదం లభించడంతో, ఆ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టి చర్చించనుంది.
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అలాగే రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సీఆర్డీఏ రద్దు బిల్లు, అమరావతి మెట్రో పాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. ముందుగా వికేంద్రీకరణ బిల్లుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ అమరావతి శాసన రాజధానిగా, విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా, కర్నూలును జ్యుడిషియల్ రాజధానిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. విశాఖ నగరంలోనే సెక్రటేరియట్, రాజ్భవన్ ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ బిల్లు చరిత్రాత్మకమైనదని బుగ్గన పేర్కొన్నారు. రాజధాని కోసం ఇచ్చిన భూములను వెనక్కి ఇచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. అలాగే అమరావతి మెట్రో పాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా కర్నూలులో కూడా పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ప్రభుత్వం సంకల్పించిందని పేర్కొన్నారు.
[subscribe]