అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరి 10, శుక్రవారం నాడు హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు అయ్యారు. సీబీఐ కోర్టులో ప్రస్తుతం అక్రమాస్తుల కేసు విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముందుగా గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానశ్రయానికి చేరుకుని, అటునుంచి నేరుగా నాంపల్లిలోని కోర్టుకు సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన కోర్టులోనే ఉండే అవకాశం ఉంది. ఈ అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఇందూ శ్యామ్ప్రసాద్రెడ్డి, తదితరులు విచారణకు హాజరయ్యారు. గత 8ఏళ్లుగా విచారణ జరుగుతున్న ఈ కేసులో జగన్ పలుమార్లు హాజరుకాగా, ముఖ్యమంత్రి హోదాలో సీబీఐ కోర్టుకు హాజరుకావడం మాత్రం ఇదే తొలిసారి. నాంపల్లి సీబీఐ కోర్టుకు సీఎం వైఎస్ జగన్ హాజరయిన నేపథ్యంలో కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆప్రాంతంలో ప్రత్యేకంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేసి, కోర్టు వద్ద మీడియాపై పలు ఆంక్షలు విధించారు.
[subscribe]