భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో తొలి టీ20 వర్షం కారణంగా రద్దవగా, రెండో టీ20లో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు (జనవరి 10) రాత్రి 7 గంటలకు నుంచి పుణె స్టేడియంలో మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ టీ20 మ్యాచ్ లోనూ గెలిచి 2-0తో సిరీస్ ను కైవసం చేసుకోవడానికి భారత్ జట్టు సిద్దమవుతుంది. రెండో టీ20లో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లో మంచి ప్రదర్శనతో భారత్ పూర్తి స్థాయిలో ఆధిపత్యం సాధించింది. ఈ నేపథ్యంలో జట్టు యాజమాన్యం తుదిజట్టులో మార్పులేమైనా చేస్తుందా లేక అదే జట్టును కొనసాగిస్తారా అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ఓపెనర్ గా కేఎల్ రాహుల్ ప్రతి మ్యాచ్ కు మెరుగవుతుండగా, శిఖర్ ధావన్ పై ఒత్తిడి నెలకుంది. మరోవైపు భారత్ యువ ఆటగాళ్లు సంజు శాంసన్, మనీశ్ పాండేలకు ఈసారైనా తుది జట్టులో అవకాశం కలిపిస్తారా అనేది వేచి చూడాలి. సీనియర్లు అందుబాటులో లేకపోవడంతో జట్టులోకి వచ్చిన శార్దుల్ ఠాకూర్, నవ్దీప్సైనీ అద్భుతంగా రాణించి దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
ఇక శ్రీలంక జట్టు పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్యంగా జట్టులో అనుభవంలేని ఆటగాళ్లతో ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్లో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సీనియర్ అయినా ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ కు రెండు టీ20లలో అవకాశం దక్కలేదు. మూడో టీ20లో మాథ్యూస్ బరిలోకి దిగనున్నాడు. డెత్ ఓవర్లలో కెప్టెన్ లసిత్ మలింగతో కలిసి బౌలింగ్ చేసి మాథ్యూస్ కీలక పాత్ర పోషించే అవకాశముంది. కుశాల్ పెరీరాతో పాటుగా అవిష్క ఫెర్నాండో, గుణతిలక రాణించాల్సి ఉంది. వరుస పరాజయాల నేపథ్యంలో ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ను సమం చేసుకోవాలని శ్రీలంక జట్టు భావిస్తుంది. పుణె పిచ్ బ్యాట్స్మెన్, బౌలర్లకు అనుకూలించనుంది. వర్ష సూచన లేదుగాని మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుదని భావిస్తున్నారు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాష్ అయ్యర్, విరాట్ కోహ్లి(కెప్టెన్ ), రిషబ్ పంత్, శివం దూబే, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్/యజ్వేంద్ర చాహల్, శార్దూల్ ఠాకూర్, జశ్ప్రీత్ బుమ్రా.
శ్రీలంక : ధనుష్క గుణతిలక, అవిష్క ఫెర్నాండో, కుశాల్ పెరీరా, భానుక రాజపక్సె, ఒషాడ ఫెర్నాండో, ఎంజెలో మాథ్యూస్, దసున్ శనక, ధనంజయ డిసిల్వ, వానిందు హసరంగ, లసిత్ మలింగ (కెప్టెన్), లహిరు కుమార.