ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరి 8, బుధవారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి నెల నుంచి అన్ని రకాల పింఛన్లను లబ్ధిదారుల ఇంటివద్దకే తీసుకెళ్లి అందించేలా చూడాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. పింఛన్ లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. సర్వేలతో ముడిపెట్టి ఇళ్లపట్టాలను నిరాకరించవద్దని, క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి లబ్ధిదారులను గుర్తించాలని సీఎం ఆదేశించారు. అర్హులు ఎంతమంది ఉన్నా ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందేనని సీఎం జగన్ చెప్పారు.
ఈ సమీక్షలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఉపాధిహామీ పనులు, నాడు-నేడు కింద పాఠశాలల్లో ప్రహరీ గోడల నిర్మాణం, మిని గౌడౌన్ల నిర్మాణం, వాటర్గ్రిడ్ వంటి అంశాలపై అధికారులతో సీఎం వైఎస్ జగన్ చర్చించారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై పలు కీలక సూచనలు చేశారు. ఉపాధిహామీ నిధులతో స్కూళ్లకు ప్రహరీ గోడలను నిర్మించాలని చెప్పారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా మరో 300 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయనున్నామని, వీటి ద్వారా మరో 3వేలకు పైగా ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 15,971 పోస్టుల భర్తీకి కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
[subscribe]