రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై ఉన్నతాధికారులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటిస్థానంలో కొనసాగుతుందని అధికారులు సీఎం వైఎస్ జగన్ కి వివరించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా మొత్తం 1,65,069 పరీక్షలు చేయగా, శుక్రవారం ఒక్క రోజే 8388 పరీక్షలు నిర్వహించామని, ప్రతి మిలియన్ జనాభాకు 3091 పరీక్షలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ కోవిడ్-19 (కరోనా వైరస్) వలన మరణాలు సంభవించకుండా ఇంకా మెరుగైన మంచి వైద్యాన్ని అందించడంపై దృష్టిసారించాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల కన్నా డిశ్చార్జీ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోందని అధికారులు సీఎంకు వివరించారు. 700 మంది కూలీలు ఎటువంటి అనుమతులు, పరీక్షలు లేకుండానే రాష్ట్రంలోకి ప్రవేశించారని, వారిపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లోని 11 చెక్ పోస్టుల వద్ద వైద్య పరీక్షల కోసం ఏర్పాట్లు చేసి, వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అలాగే విశాఖపట్నంలో గ్యాస్ లీక్ ఘటనలో పశువులకు కూడా చికిత్స చేస్తున్నామని, అందుకోసం మొత్తం 13 వెటర్నరీ బృందాలు పని చేస్తున్నాయని అధికారులు సీఎం వైఎస్ జగన్కు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu