విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే దాదాపు 500 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ దుర్ఘటనకు కారణమైన ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమను మూసివేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం నుంచి స్థానికులు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్యాస్ లీకేజి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలతో ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ గేటు వద్ద బాధితులు ఆందోళన నిర్వహించారు. పరిశ్రమ వద్ద ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితిని విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా పర్యవేక్షిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ ఆందోళనలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో గ్యాస్ లీకేజ్ బాధితులకు సహాయం చేయడంపై దృష్టి పెట్టాలి తప్ప, ఆందోళనలు చేయకూడదని అన్నారు. విశాఖపట్నంలో ఎల్.జి.పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనపై కొన్ని రాజకీయ పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి. ఇలా చేయడం కోవిడ్ -19 రోగుల సంఖ్యను పెంచి, పరిస్థితిని చేయిదాటేలా చేస్తుంది. ఇటువంటి ఆందోళనలకు ఇది సరైన సమయం కానందున, జనసైనికులు మరియు జనసేన నాయకులందరూ ఇలాంటి ఆందోళనలలో భాగం కావద్దని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. దయచేసి అందరూ బాధితుల కుటుంబాలకు సహాయం చేయడంపై దృష్టి పెట్టాలని,
గ్యాస్ లీకేజ్ ఘటనపై రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తుది నివేదికలు వచ్చే వరకు వేచి చూడాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]