ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి నేటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ సంబంధ సేవలన్నింటినీ గ్రామాల్లోనే రైతులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను నేడు ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 10,641 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. అలాగే రైతు భరోసా కేంద్రాలతో పాటుగా కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్ మెంట్ (సీఎం) యాప్ ను కూడా సీఎం ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా పంటల వివరాలను తెలుసుకోవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,641 గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి కేంద్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన సహాయకులు రైతులకు సేవలు అందించనున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరాతో పాటుగా భూసార పరీక్షలు కూడా నిర్వహించి వాటి ఆధారంగా ఏఏ పంటలు వేసుకోవచ్చో సూచనలు ఇస్తారు. గ్రామాలలో రైతులు, కౌలు రైతులు ఎంతమంది ఉన్నారో గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలకు సిఫార్సు చేస్తారు. రైతు భరోసా కేంద్రాల్లో అత్యాధునిక డిజిటల్ కియోస్క్లు ఏర్పాటు చేసి పలు రకాల సేవలు అందించనున్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు శిక్షణా తరగతులు మరియు విజ్ఞాన కేంద్రాలుగా కూడా రైతుభరోసా కేంద్రాలను ఉపయోగించుకోనున్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ను కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇకపై కాల్ సెంటర్ నెంబర్ 155251 ద్వారా రైతులకు సలహాలు, సూచనలు అందించనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu