ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు మార్చ్ 7, శనివారం నాడు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్నికల నియమావళిని అతిక్రమించి అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినట్లు రుజువైతే ఆ వ్యక్తులు గెలిచినప్పటికీ వారిని అనర్హులుగా పరిగణించడంతో పాటు ఆరేళ్లపాటు తిరిగి ఎన్నికల్లో పోటీచేయకుండా ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. అలాగే వారికీ మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.పదివేల వరకు జరిమానా విధించనున్నారు. ఈ నేపథ్యంలో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీతో పాటు ఇతర ప్రలోభాలకు అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ప్రలోభాలు, బెదిరింపులను సామాన్యులు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు నిఘా పేరుతో ఒక యాప్ రూపొందించారు.
మార్చ్ 7, శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన నివాసంలో ఈ ‘నిఘా యాప్’ ను ఆవిష్కరించారు. ఎన్నికల సంఘం, పోలీసులు తీసుకుంటున్న చర్యలకు అదనంగా అక్రమాలను నిరోధించేందుకు నిఘా యాప్ను ఉపయోగించనున్నారు. ప్రజలంతా ఈ నిఘా యాప్ను డౌన్లోడ్ చేసుకోని, తమ దృష్టికి వచ్చిన ఎటువంటి చట్ట వ్యతిరేక చర్యలనైనా ఈ యాప్ లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఈ నిఘా యాప్ ద్వారా చేసే ఫిర్యాదులు నేరుగా పోలీస్ సెంట్రల్ కంట్రోల్ రూంకు చేరుతాయి. అనంతరం సంబంధిత అధికారులు ఈ ఫిర్యాదులపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటారు. నిఘా యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ప్రభుత్వ ప్రణాళిక సంఘం కార్యదర్శి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
[subscribe]