ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జనవరి 27, సోమవారం ఉదయం సచివాలయంలోని మొదటి బ్లాక్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అయింది. ఈ సమావేశంలో శాసనమండలి రద్దు అంశంపై కీలకంగా చర్చించారు. అనంతరం శాసనమండలి రద్దు ప్రతిపాదనకు కేబినేట్ ఆమోదం తెలిపింది. మరికొద్దిసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండడంతో మండలి రద్దు తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. మండలి రద్దు అంశంపై ప్రత్యేకంగా చర్చించిన తరువాత సభలో ఆమోదించనున్నారు. రద్దు తీర్మానం సభలో ఆమోదం పొందిన తర్వాత కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
శాసనమండలి రద్దుపై శాసన, న్యాయపరమైన ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్నాకే మండలి రద్దుకు సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు మండలిలో ఆమోదం పొందకపోవడం, శాసనమండలి చైర్మన్ షరీఫ్ ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపే క్రమంలో చోటు చేసుకున్న పలు పరిణామాల నేపథ్యంలోనే సీఎం వైఎస్ జగన్ మండలి రద్దుకు గట్టిగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.
[subscribe]