తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చ్ 6న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో రోజున గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ చర్చ సందర్భంగా అధికార టిఆర్ఎస్ పార్టీ, విపక్ష కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య వాడివేడిగా వాదనలు కొనసాగాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడంతో సభలో గందరగోళం మొదలైంది. దీంతో రాజగోపాల్రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది.
మరోవైపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో సీఎం కేసీఆర్ సమాధానం చెబుతున్న సమయంలో ఆయన ప్రసంగానికి కాంగ్రెస్ సభ్యులు అడ్డుతగిలారు. ఈ క్రమంలో ఆరుగురు కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సభలో సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక రోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సస్పెండ్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, డి.శ్రీధర్బాబు, సీతక్క, పొదెం వీరయ్య, జగ్గారెడ్డి ఉన్నారు.
[subscribe]