ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 21, శనివారం నాడు అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మగ్గం ఉన్న చేనేతల కుటుంబానికి ప్రతి సంవత్సరం రూ.24 వేల ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ సందర్భంగా పలు చేనేత కుటుంబాలకు సీఎం జగన్ చెక్కులను అందజేశారు. సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ నేతన్నలకు మాట ఇచ్చానని, దాన్ని నిలబెట్టుకుంటున్నానని అన్నారు. ధర్మవరం చేనేత నైపుణ్యాన్ని ప్రపంచం మొత్తం చెప్పుకుంటోందని, కాని ఇక్కడి చేనేత సమస్యలను ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. చేనేతల కుటుంబాలు పేదరికం, అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితుల్లో ఉన్నారని, ఆప్కో వ్యవస్థలో మార్పులు చేసి చేనేత కార్మికులను ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో పలు పేదవర్గాలకు నవరత్నాల అమలు చేస్తూ మేలు చేస్తున్నామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే అనేక మంచి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. రాష్ట్రంలో 4లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, లక్షా 30 వేలమందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించామని అన్నారు. జనవరి 9న అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభిస్తామని, అలాగే ఉగాది నాటికి 25 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలు అందజేస్తామని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాల గురించి సీఎం వైఎస్ జగన్ ప్రజలకు వివరించారు.
[subscribe]