ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాడు రాజధానిపై జీఎన్రావు కమిటీ తమ నివేదికను సీఎం వైఎస్ జగన్ కు సమర్పించడంతో అమరావతి ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శనివారం నాడు రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మందడంలో రైతులు రోడ్డుపై బైఠాయించి, స్పీడ్ యాక్సిస్ రోడ్డుపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. రోడ్డుపై విద్యుత్ స్తంభం, బెంచీలు, కుర్చీలు అడ్డంపెట్టి ఆందోళనకు దిగారు. అలాగే వెలగపూడిలో రైతులు వరుసగా నాలుగో రోజు నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం వెంటనే మూడు రాజధానుల ఆలోచనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరో వైపు వెలగపూడిలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. గ్రామపంచాయితీ కార్యాలయానికి రంగులు మార్చేయడానికి గ్రామస్తులు సిద్ధపడగా, పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అలాగే మందడంలో టైర్లు కాల్చేందుకు రైతులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాజధాని ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించి, శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన 29 గ్రామాలకి చెందిన ప్రజలు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపడుతుండడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపడుతున్నారు.
[subscribe]