ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్టోబర్ 4, శుక్రవారం నాడు ఏలూరులో ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకాన్ని ప్రారంభించారు. సొంతంగా ఆటో, టాక్సీ నడుపుకుంటూ వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్లకు ప్రతి ఏటా 10 వేల రూపాయలు అందించేలా వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గతంలో ప్రజాసంకల్పయాత్రలో ఆటోడ్రైవర్ల కష్టాలను స్వయంగా చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండగా ఉంటామని, సంవత్సరానికి 10వేలు చొప్పున ఆర్ధిక సాయం అందిస్తామని నాడు ఏలూరులో ప్రకటించారు. ఇప్పుడు అదే ఏలూరులో వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించడం విశేషం. ఈ పథకం కింద 1,73,531 మంది లబ్దిదారులు ప్రతి ఏడాది రూ.10 వేల చోప్పున అందుకోనున్నారు.
గురువారం ఉదయమే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలుతగా ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు. అక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రూ.266 కోట్ల వ్యయంతో కొత్తగా వైద్య కళాశాలను నిర్మించనున్నారు.అనంతరం ఇండోర్ స్టేడియంలో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకాన్ని ప్రారంభించారు. కొద్దీ సేపు లబ్ధిదారులతో ముచ్చటించారు, ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు ఆళ్లనాని, పేర్నినాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, కలెక్టర్ ముత్యాల రాజు, ఉన్నతాధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
[subscribe]